జయరాం హత్య కేసు హైదరాబాద్కు షిఫ్ట్: ట్విస్ట్.. శిఖాచౌదరి పాత్రపై విచారణ!
హైదరాబాద్: ఎన్నారై వ్యాపారవేత్త జయరాం కేసు ఏపీలోని నందిగామ నుంచి హైదరాబాదుకు బదలీ అయిందని సీపీ అంజనీ కుమార్ గురువారం చెప్పారు. జయరాం కేసుకు సంబంధించిన ఫైలును కృష్ణా జిల్లా ఎస్పీ తమకు పంపించారని చెప్పారు.
జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తామని చెప్పారు. బంజారాహిల్స్ ఏసీపీ కేఎస్ రావును దర్యాఫ్తు అధికారిగా నియమించామని ఆయన తెలిపారు.
పద్మశ్రీ ఫిర్యాదలోని అంశాలను పరిగణలోకి తీసుకుంటాం
ఈ కేసులో జయరాం సతీమణి పద్మశ్రీ ఇచ్చిన ఫిర్యాదును, ఆమె ఫిర్యాదులో పేర్కొన్న అంశాలను పరిగణలోకి తీసుకుంటామని సీపీ అంజనీ కుమార్ తెలిపారు. జయరాం కేసులో ఆయన మేనకోడలు శిఖా చౌదరి పాత్ర ఉందని పద్మశ్రీ అనుమానిస్తున్నారు. ఆమె పాత్ర లేకుండా ఈ హత్య జరిగి ఉండదని భావిస్తున్నారు. ఈ మేరకు ఆమె ఫిర్యాదు చేశారు. దీంతో ఆ కోణంలో హైదరాబాద్ పోలీసులు విచారణ జరిపే అవకాశముంది.
'శిఖా చౌదరి హైఫైలైఫ్, పేదమ్మాయి బీఎండబ్ల్యులో తిరిగేస్థాయికి ఎలా ఎదిగింది?'
పోలీసు అధికారులపై దర్యాఫ్తు
జయరాం కేసులో పోలీసు అధికారులపై వచ్చిన ఆరోపణలపై దర్యాఫ్తు చేస్తామని సీపీ అంజనీ కుమార్ తెలిపారు. ఈ కేసులో ఓ ఇన్స్పెక్టర్, ఓ ఏసీపీ పైన ఆరోపణలు వచ్చాయి. దీంతో వారిపై అధికారులు చర్యలు తీసుకున్నారు. నిందితుడు రాకేష్ రెడ్డి కాల్ లిస్టులో వారి పేర్లు ఉన్నాయి. దీంతో వారిని కూడా విచారించనున్నారని తెలుస్తోంది.
ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ ఉత్తర్వులు
కాగా అంతకుముందు, జయరామ్ హత్యకేసులో శిఖాచౌదరిపై అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ కేసును హైదరాబాద్ బదలీ చేయాలని పద్మశ్రీ కోరారు. హైదరాబాదులో హత్య జరిగినందున బదలీ చేయాలన్నారు. ఈ నేపథ్యంలో కేసును తెలంగాణకు బదిలీ చేస్తూ ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. హత్య హైదరాబాద్లోనే జరిగినట్లు వెల్లడికావడంతో, ఇక్కడే విచారణ జరగాలనీ, ఏపీ పోలీసులపై తనకు నమ్మకం లేదని జయరాం భార్య పద్మశ్రీ హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించారు.