ఉద్యోగం పేరుతో వంచన: వ్యభిచార కూపంలోకి...
ఉపాధి పేరుతో ఆశ చూపారు. కూటి కోసం వస్తే అంతే సంగతులు. వ్యభిచార కూపంలోకి లాగారు. ఇలా చాలా మంది మహిళల జీవితాలను ఛిద్రం చేశారు. పల్లె నుంచి పట్నం వచ్చిన వారిని ఆసరాగా చేసుకొని మోసం చేశారు. అయితే ఢిల్లీ నుంచి వచ్చిన ఓ మహిళను కూడా చీట్ చేయబోయారు. ఆమె తప్పించుకోవడంతో వారి గుట్టురట్టయ్యింది.
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన సతీష్, వరంగల్కి చెందిన సురేశ్, తూర్పుగోదావరికి చెందిన పవన్, అఖిల్, తేజ, చరణ్ ముఠాగా ఏర్పడ్డారు. ఉపాధి కోసం నగరానికి వచ్చేవారిని టార్గెట్ చేశారు. వారికి మాయమాటలు చెప్పి.. వ్యభిచార కూపంలోకి నెట్టేవారు. వీరి చేతుల్లో చాలా మంది ఇరుక్కున్నారు. అయితే ఇటీవల ఢిల్లీ నుంచి ఓ యువతి వచ్చారు. ఆమెను కూడా అందులో దించే ప్రయత్నం చేయగా.. ఆమె తప్పించుకుంది.
యువతిని ఫేస్ బుక్లో పరిచయం అయ్యారు. ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పారు. దీంతో ఆమె ఇక్కడికి వచ్చారు. ఆమెతో మాట్లాడిన సతీష్.. వ్యభిచార వృత్తిలోకి దించే ప్రయత్నం చేశారు. ఆమె తెలివితో తప్పించుకున్నారు. తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ముఠా లీలలు వెలుగుచూశాయి. సతీష్, సురేశ్, పవన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు.