డీఎస్ హాట్ కామెంట్స్: టీఆర్ఎస్పై ప్రజల్లో అసంతృప్తి, అభివృద్ధి ఏదీ అంటూ..
టీఆర్ఎస్ సీనియర్ నేత, ఎంపీ డీ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీపై ప్రజల్లో అసంతృప్తి ఉంది అని హాట్ కామెంట్స్ చేశారు. గత కొద్దీరోజులుగా డీఎస్.. స్వపక్షంలోనే విపక్షంలా మెలగుతున్నారు. టీఆర్ఎస్ అధినాయకత్వంతో సఖ్యత లేదు. హైకమాండ్తో మాట్లాడిందీ లేదు. కానీ పార్టీకి వ్యతిరేకంగా కామెంట్స్ చేశారు. బల్దియా ఎన్నికల నేపథ్యంలో డీఎస్ కామెంట్స్ కాకరేపుతున్నాయ్.
ప్రజల్లో వ్యతిరేకత..?
టీఆర్ఎస్ పార్టీపై ప్రజల్లో అసంతృప్తి ఉందని డీ శ్రీనివాస్ చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. ప్రజలకు ప్రభుత్వం నిజంగా పని చేసి ఉంటే అసంతృప్తి ఎందుకు ఉంటుందని ప్రశ్నించారు. గ్రేటర్ ఎన్నికలు నిర్వహిస్తున్న తీరు దారుణంగా ఉందన్నారు. జీవితంలో ఇలాంటి ఎన్నికలు ఎప్పుడు చూడలేదని తెలిపారు. వరద బాధితులకు పూర్తి సాయాన్ని అందించిన తర్వాతే ఎన్నికలు పెడితే బాగుండేందని అభిప్రాయపడ్డారు. హడావుడిగా నిర్వహించాల్సిన అవసరం ఏమొచ్చిందని చెప్పారు.
ఎక్కడ అభివృద్ది..
హైదరాబాద్లో రూ. 68 వేల కోట్లతో అభివృద్ధి పనులు చేశామని ప్రభుత్వం చెబుతోందని.. మరీ ఆ డెవలప్ మెంట్ ఎక్కడ కనిపిస్తోందని ప్రశ్నించారు. సిటీలో గల ఫ్లై ఓవర్లు కాంగ్రెస్ హయాంలో నిర్మించారని చెప్పారు. వాటి నిర్వహణను కూడా సరిగా చేయడం లేదని మండిపడ్డారు. దుబ్బాకలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు నియోజకవర్గాలకు ఆనుకునే ఉందని చెప్పారు.
ట్రెండ్ తెలిసిపోయింది.. కదా...?
మరీ ఉపఎన్నికలో ప్రజల ఆలోచన ఎలా ఉందో స్పష్టంగా అర్థమైందని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం సరిగా పని చేసి ఉంటే ప్రజల్లో వ్యతిరేకత ఎందుకు వస్తుందని నిలదీశారు. ప్రజల్లో టీఆర్ఎస్ విశ్వసనీయతను పెంచుకోవాలని సూచించారు. అంతేకాదు తనను కూడా టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడో మర్చిపోయిందని కామెంట్ చేశారు. పార్టీతో డీఎస్ కూడా అంటీ ముట్టగట్టుగానే వ్యవహారిస్తున్నారు.
Recommended Video
అర్వింద్ బీజేపీలో....
డీఎస్ కుమారుడు అర్వింద్ మాత్రం బీజేపీలో ఉన్నారు. నిజామాబాద్ నుంచి ఎంపీగా కవితపై విజయం సాధించారు. డీఎస్ కూడా బీజేపీలో చేరతారనే ప్రచారం జరిగింది. కానీ ఆయన మిన్నకుండిపోయారు. టీఆర్ఎస్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతూ వస్తున్నారు. కానీ గురువారం చేసిన కామెంట్స్ మాత్రం చర్చకు దారితీశాయి.