ఫాంహౌస్ కేసులో రాజ్భవనా?, నా ఫోన్ ట్యాపింగ్!: కేసీఆర్ సర్కారుపై తమిళిసై సంచలనం
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సంచలన ఆరోపణలు చేశారు. రాజ్భవన్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గవర్నర్ మాట్లాడుతూ.. కేవలం రాజ్ భవన్ గౌరవాన్ని దిగజార్చేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

ఫాంహౌస్ కేసులోకి రాజ్భవన్ను లాగుతారా?
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులోకి రాజ్భవన్ను లాగాలను రాష్ట్ర ప్రభుత్వం చూసిందని గవర్నర్ తమిళిసై మండిపడ్డారు. తుషార్ పేరు ఫాంహౌస్ కేసులో ఉంటే.. ఆ కేసులోకి రాజ్ భవన్ను లాగుతారా? అని నిలదీశారు. తుషార్ గతంలో తన దగ్గర ఏడీసీగా పనిచేశారన్నారు. ఫాంహౌస్ కేసులో ఉన్న తుషార్.. ఈ తుషార్ వేర్వేరని.. అయినా.. గవర్నర్పై తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. తనకు అభినందనలు తెలిపేందుకు ఢిల్లీ నుంచి వచ్చారని, తుషార్ తనకు పలుమార్లు ఫోన్లు చేశారన్నారు. ఈ నేపథ్యంలోనే టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి పలువురు ఆరోపణలు చేయడం ఏంటని ప్రశ్నించారు.

తన ఫోన్ కూడా ట్యాప్ అవుతోందంటూ గవర్నర్ తమిళిసై సంచలనం
ఫాంహౌస్ కేసులో రాజ్ భవన్ పాత్ర ఉందని తప్పుడు ప్రచారం చేశారని టీఆర్ఎస్పై గవర్నర్ తమిళిసై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేగాక, రాష్ట్ర ప్రభుత్వం తన ఫోన్ ట్యాపింగ్ చేస్తుందనే అనుమానాలను వ్యక్తం చేశారు తమిళిసై. రాష్ట్రంలో అప్రజాస్వామిక పరిస్థితులున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఫోన్ ట్యాపింగ్ చేసినంత మాత్రాన తాను భయపడేది లేదన్నారు. రాజ్ భవన్లో అన్ని వ్యవహారాలు పాదర్శకంగానే సాగుతున్నాయన్నారు. కావాలంటే తన ఫోన్ కూడా ఇస్తానని మీడియా ప్రతినిధులతో తమిళిసై అన్నారు.

రాజ్భవన్.. ప్రగతి భవన్లా కాదంటూ గవర్నర్ తమిళిసై
మరోవైపు, రాజ్ భవన్.. ప్రగతి భవన్లా కాదని ఎవరైనా రావచ్చని తమిళిసై అన్నారు. తాను ఎవరికైనా అపాయింట్మెంట్ ఇస్తానని.. తన వద్దకు వచ్చి మాట్లాడవచ్చని తెలిపారు. రాష్ట్రంలో విద్యను అమ్మకానికి పెడితే సహించేది లేదని.. ప్రైవేట్ యూనివర్సిటీల విషయంలో ఆమె స్పందించారు. యూనివర్సిటీల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు జరగడం విచారకరమని, ఇలాంటి సహించేది లేదని గవర్నర్ తమిళిసై స్పష్టం చేశారు. గవర్నర్ను ఛాన్సలర్ బాధ్యతల నుంచి తప్పించిన కేరళ ప్రభుత్వ చర్య సరికాదన్నారు.












Click it and Unblock the Notifications