బంజారాహిల్స్ భూ కబ్బా కేసు, టీజీ వెంకటేశ్ అరెస్ట్ గురించి పోలీసుల తర్జన భర్జన..? గాలింపు
బంజారాహిల్స్ భూ కబ్జా కేసు తీవ్ర దుమారం రేపింది. ఇందులో ప్రముఖుల పేర్లు వెలుగులోకి వచ్చాయి. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10 ల్యాండ్ కబ్జా కేసులో పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ కేసులో ఏ1గా ఉన్న విశ్వప్రసాద్తోపాటు మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు. అమెరికాలో ఉన్న విశ్వప్రసాద్ను హైదరాబాద్ తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అమెరికా దౌత్య కార్యాలయంలో లెటర్ ఇవ్వాలని పోలీసులు భావిస్తున్నారు.
ఏ5గా ఉన్న రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ను అరెస్ట్ చేసే అంశంపై పోలీసులు న్యాయ సలహా తీసుకుంటున్నారు. ముందుగా రాజ్యసభ వైస్ చైర్మన్కు సమాచారం ఇవ్వాలా? లేక అదుపులోకి తీసుకున్న తర్వాత సమాచారం ఇవ్వాలా? అనే అంశంపై స్పష్టత రాలేదు. కేసులో ప్రధాన నిందితుల వాంగ్మూలం ఆధారంగా టీజీ వెంకటేష్ పేరు ఏ5గా చేర్చినట్లు పోలీసులు చేశారు. సినిమా షూటింగ్ అని చెప్పి, కబ్జా కోసం యత్నించినట్లు స్పష్టమైన ఆధారాలు సేకరించామని పోలీసులు చెబుతున్నారు. ఆ భూమి వందల కోట్ల విలువ చేస్తుంది.
బంజారా హిల్స్ రోడ్డు నెంబర్ 10 లో గల ఏపీ జెమ్స్ అండ్ జ్యూయలర్స్ పక్కన ఉన్న స్ధలం వివాదం ఉంది. దీంతో తనకు సంబంధం లేదని బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ చెప్పారు. ఆ భూమి విషయంలో రెండు వర్గాల మధ్య చాలాకాలంగా గొడవ నడుస్తోందని అన్నారు. టీజీ విశ్వప్రసాద్ నాకు దూరపు బంధువు అని చెప్పారు. టీజీ విశ్వప్రసాద్తో అన్నివిషయాల్లో సంబంధం ఉందనేది వాస్తవం కాదని చెప్పారు.
విశ్వ ప్రసాద్ తమ తాతగారి వంశంలోని పిల్లలకు చెందిన వ్యక్తి. ఈ వివాదంలో తనకు ఏమి సంబంధం లేదని టీజీ వెంకటేశ్ చెప్పారు. తను పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశానికి లక్షద్వీప్ వెళ్లానని ఆయన వివరించారు. ఈ నెల 17వ తేదీన రాసిన ఎఫ్ఐఆర్ లో తర పేరు లేదని... 18వ తేదీన ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్లో మాత్రం పేరు చేర్చారని వెంకటేష్ అన్నారు. కానీ పోలీసులు మాత్రం నిందితుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.