Hyderabad: హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు..
ట్రాఫిక్ పోలీసులు హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లోక్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం హైదరాబాద్ కు రానున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నట్లు చెప్పారు. ఈ ట్రాఫిక్ ఆంక్షలు మంగళవారం రాత్రి, బుధవారం ఉదయం అమల్లో ఉంటాయి.
బేగంపేట్ నుంచి రాజ్ భవన్ వెళ్లే మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తామని హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇందుకు ప్రజలు సహకరించాలని కోరారు. నరేంద్ర మోదీ మంగళవారం రాత్రి 7.50 నిమిషాలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రాజ్ భవన్ కు బయల్దేరుతారు. ఈ మార్గంలో రాత్రి 7 గంటల 50 నిమిషాల నుంచి 8 గంటల 25 నిమిషాల వరకు బేగంపేట్ వినాశ్రయం నుంచి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, మోనప్ప ఐలాండ్, రాజ్ భవన్ వరకు ప్రైవేట్ వాహనాలను అనుమతించరు.

ప్రధాని నరేంద్ర మోదీ రాజ్ భవన్ లో బస చేస్తారు. తిరిగి బుధవారం ఉదయం రాజ్ భవన్ నుంచి బేగంపేట విమానాశ్రయానికి వెళ్తారు. ఉదయం 8 గంటల 35 నిమిషాల నుంచి 9 గంటల 10 నిమిషాల వరకు రాజ్ భవన్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, బేగంపేట్ విమానాశ్రయం మార్గంలో వాహనాలను అనుమతించరు. ఈ సమయాల్లో వాహనదారులు ఇతర మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచించారు.
నరేంద్ర మోదీ బేగంపేట్ విమానాశ్రయం నుంచి హెలికాప్టర్ లో వేములవాడ వెళ్తారు. బుధవారం ఉదయం వేములవాడకు చేరుకుని 9 గంటలకు రాజన్న దర్శనం చేసుకుంటారు. ఆ తర్వాత వేములవాడలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. బండి సంజయ్ కి మద్దతుగా ప్రచారం చేయనున్నారు. మోదీ రాక సందర్భంగా వేములవాడలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. 1200 మంది పోలీసులు బందోబస్తులో పాల్గొనున్నారు.












Click it and Unblock the Notifications