క్యూనెట్ మోసంలో 70 మంది అరెస్ట్.. చైన్ మార్కెటింగ్లో కోట్లు కొల్లగొట్టి..!
హైదరాబాద్ : మల్టీ లెవెల్ మార్కెటింగ్ మోసాలతో ఎందరో బలవుతున్నారు. కొందరు ఆర్థికంగా నష్టపోతే.. మరికొందరు ప్రాణాలు తీసుకుంటున్నారు. చైన్ మార్కెటింగ్ "మాయ" అని తెలిసినా కూడా దానికి అట్రాక్ట్ అవుతున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ మొత్తం వస్తుందనే ఆశతో గొలుసుకట్టు వలలో చిక్కుకుంటున్నారు. ఆ క్రమంలో "క్యూనెట్" సంస్థ మోసాలకు ఎందరో అప్పుల పాలయ్యారు. మరెందరో ప్రాణాలు కూడా తీసుకున్నారు. ఆ సంస్థ మోసగించడంతో పెద్ద మొత్తంలో డబ్బులు పొగొట్టుకున్నారు బాధితులు. ఎట్టకేలకు క్యూనెట్ స్కామ్లో 70 మందిని పోలీసులు అరెస్ట్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

మల్టీ లెవెల్ దెబ్బ.. 70 మంది అరెస్ట్.. 38 కేసులు
చైన్ మార్కెటింగ్ స్కీమ్తో కోట్లు కొల్లగొట్టిన క్యూనెట్ కుంభకోణంలో తీగ లాగితే డొంక కదిలింది. ఆ నేపథ్యంలో బాధితులు పెద్ద ఎత్తున బయటకు రావడంతో పలుచోట్ల కేసులు నమోదయ్యాయి. ఆ క్రమంలో తాజాగా పోలీసులు 70 మందిని అరెస్ట్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఒక కేసులో అంతమందిని అరెస్ట్ చేయడం చర్చానీయాంశమైంది. వారిపై 38 కేసులు నమోదు చేసినట్లు సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ తెలిపారు.
క్యూనెట్ సంస్థ మోసాలకు సంబంధించి బెంగళూరులో 2 కోట్ల 70 లక్షలు సీజ్ చేసినట్లు తెలిపారు. అంతేకాదు ఆ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించిన సినీ ప్రముఖులకు కూడా ఇదివరకే నోటీసులు ఇచ్చినట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా క్యూనెట్ సంస్థ 5 వేల కోట్ల రూపాయల మేర మోసం చేసినట్లు దర్యాప్తులో వెల్లడైందని చెప్పుకొచ్చారు. మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ తదితర రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున బాధితులున్నట్లు తెలిపారు.

రిజిస్టార్ ఆఫ్ కంపెనీస్ ఆదేశాలతో..!
క్యూనెట్ సంస్థ మోసాలు అన్నీ ఇన్నీ కావు.. అదే క్రమంలో కేసును లోతుగా విచారించాలని రిజిస్టార్ ఆఫ్ కంపెనీస్ ఆదేశాలు ఇచ్చిందన్నారు సజ్జనార్. ఇటీవలే క్యూనెట్ బాధితుడైన సాఫ్ట్వేర్ ఇంజనీర్ సైబరాబాద్లో ఆత్మహత్య చేసుకున్నాడని, మరో వ్యక్తి సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. ఈ సంస్థకు సంబంధించిన కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖులు దేశం దాటి పోకుండా 12 మందిపై లుక్ ఔట్ నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు. క్యూనెట్ సంస్థలో అసలు ఎలాంటి రికార్డులు లేవని.. 100 రూపాయల విలువ చేసే వస్తువును 1500 రూపాయలకు అమ్ముతూ మోసాలకు పాల్పడినట్లు గుర్తించామన్నారు.

దేశవ్యాప్తంగా లక్షలాది మందికి కుచ్చుటోపి..
మల్టీలెవెల్ మార్కెటింగ్ తో మాయాజాలం చేసిన క్యూనెట్ సంస్థ దేశవ్యాప్తంగా లక్షలాది మందికి కుచ్చుటోపి పెట్టింది. దాదాపు వెయ్యి కోట్ల రూపాయల కుంభకోణంగా భావిస్తున్న క్యూనెట్ మోసాలు అన్నీ ఇన్నీ కావు. 1998లో హాంకాంగ్ కేంద్రంగా క్యూవన్ గ్రూపును స్థాపించారు జోసఫ్ బిస్మార్క్, విజయ్ ఈశ్వరన్. అయితే అందులో నష్టాలు రావడంతో దాన్ని మూసివేశారు. 2001లో భారతదేశానికి వచ్చిన వీరిద్దరు గోల్డ్క్వెస్ట్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రారంభించారు. బంగారు కాయిన్ల పేరుతో బిజినెస్ చేశారు.

ఇద్దరే ప్రధాన సూత్రధారులు.. కోట్లల్లో మోసం
వారిద్దరే సూత్రధారులుగా సాగిన ప్రస్థానం.. ఎన్నో కంపెనీలు స్థాపించడానికి కారణమైంది. 2004లో క్వెస్ట్నెట్ ఎంటర్ప్రైజెస్ పేరుతో గోల్డ్ కాయిన్స్, హాలిడే ట్రిప్స్ వంటి కార్యకలాపాలతో చాలామందిని బురిడీ కొట్టించారు. దేశవిదేశాలకు వ్యాపారం విస్తరించి అమాయకుల నుంచి అందినకాడికి దండుకున్నారు. 2010లో కొన్ని ఆరోపణల నేపథ్యంలో కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వీరి కంపెనీలపై ఉక్కుపాదం మోపింది.
విచారణకు ఆదేశించడంతో సదరు సంస్థల కార్యకలాపాలు స్తంభించిపోయాయి. అయితే 2011లో విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండియా పేరుతో మరో కంపెనీని ప్రారంభించి.. దానికి అనుబంధంగా క్యూనెట్ బ్రాండుతో బిజినెస్, ఎడ్యుకేషన్, హెల్త్, జ్యువెల్లరీ, విహార యాత్రలు తదితర అంశాల్లో ఆకర్షణీయమైన ప్యాకేజీలు తయారుచేసి ఛైన్ మార్కెటింగ్తో జనాలను బోల్తా కొట్టించారు.












Click it and Unblock the Notifications