ఎమ్మెల్యేగా రఘునందన్ అసెంబ్లీలో .. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు శాసనమండలిలో ప్రమాణ స్వీకారం
దుబ్బాకలో అధికార టీఆర్ఎస్ తో పోరాడి విజయం సాధించిన బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు ఈరోజు శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు ను తెలంగాణ శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయించారు. రఘునందన్ రావు మాత్రమే కాకుండా గవర్నర్ కోటాలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు గోరటి వెంకన్న, బొగ్గారపు దయానంద్, బస్వరాజు సారయ్య లు నేడు శాసనమండలిలో ప్రమాణ స్వీకారం చేశారు.
తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , గోరటి వెంకన్న, బస్వరాజు సారయ్య, బొగ్గారపు దయానంద్ లతో ప్రమాణ స్వీకారం చేయించారు. గతంలో ఎమ్మెల్సీలుగా ఉన్న రాములు నాయక్, కర్నే ప్రభాకర్, దివంగత నాయని నర్సింహారెడ్డి ల పదవీకాలం పూర్తి కావడంతో ఆస్థానాలలో ఈ ముగ్గురిని భర్తీ చేశారు సీఎం కేసీఆర్ . గత ఆగస్టు నాటి నుండి మండలిలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ గానే ఉన్నాయి. తాజాగా ఈ స్థానాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ గోరటి వెంకన్న , బొగ్గారపు దయానంద్ , బస్వరాజు సారయ్యని ఎంపిక చేశారు.
ఈ రోజు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముందు వీరంతా గన్ పార్క్ లోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు . ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు లు హాజరై కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు శుభాకాంక్షలు తెలియజేశారు. గవర్నర్ కోటాలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు సీఎం కేసీఆర్ కు తమ కృతజ్ఞతలు తెలియజేశారు. ఎమ్మెల్సీలుగా తమకిచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తామని, రాష్ట్ర అభివృద్ధికి పాటు పడతామని పేర్కొన్నారు.