రాష్ట్రానికి మరోసారి రాహుల్, కేటీఆర్ అడ్డాలో పర్యటన..? భారీగా చేరికలు.?: రేవంత్ రెడ్డి
టీఆర్ఎస్ పార్టీపై టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైరయ్యారు. మున్ముందు కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు ఉంటాయని వెల్లడించారు. బీజేపీ, ప్రశాంత్ కిశోర్తో కలిసి సీఎం కేసీఆర్ నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. బెంగాల్ తరహాలో తెలంగాణలో ప్రతిపక్షాలు లేకుండా చేయాలని పీకే వ్యుహ రచన చేస్తున్నారని మండిపడ్డారు. పీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టి జులై 7వ తేదీకి ఏడాది పూర్తవుతుంది.
అందుకే గోప్యం..
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో జరిగిన వ్యవహారాలను పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇంఛార్జీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్కు వివరించానని రేవంత్ తెలియజేశారు. పార్టీలో చేరే వారి గురించి ముందే తెలియడం వల్ల అధికార పార్టీ వారిపై కేసులు పెట్టి అరెస్టులు చేస్తోంది. అందువల్లే పార్టీలో చేరే వారిని ముందుగా మీడియాకు తెలియనివ్వడం లేదని చెప్పారు.
హైదరాబాద్లో విష్ణువర్ధన్ రెడ్డి తనను కూడా ఆహ్వానించారని మీడియా కావాలని తప్పుడు ప్రచారం చేస్తోందని తెలిపారు. హైదరాబాద్లో కార్యకర్తలను కలుపుకొని విష్ణువర్ధన్ రెడ్డి సభ పెడతానన్నారు. దానికి తాను అనుమతి ఇచ్చానని తెలిపారు. తమ మధ్య విభేదాలు ఉన్నాయని చెప్పడం సరికాదన్నారు.
కాంగ్రెస్ సభకు ఆశేష జనం
రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక సందర్భంగా విపక్షాల మీటింగ్కి సీఎం కేసీఆర్ ఎందుకు డుమ్మా కొట్టారని అడిగారు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడానికి బీజేపీ సహాయం చేస్తోందని ఫైరయ్యారు. పరేడ్ గ్రౌండ్లో బీజేపీ అయ్యింది.. టీఆర్ఎస్ సభ పెట్టాలి.. ఆ తర్వాత మూడో సభ కాంగ్రెస్ పార్టీ పెడుతుందని రేవంత్ చెప్పారు.దానికి ఎంతమంది వస్తారో చూడాలని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
మరోసారి రాహుల్ రాక
సెప్టెంబర్లో మరోసారి రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత రాహుల్ గాంధీ రానున్నారు. మంత్రి కేటీఆర్ నియోజకర్గం సిరిసిల్లకు సెప్టెంబర్ 17వ తేదీన ఆయన వస్తారట. అక్కడి నుంచే విద్యార్థి యువజన డిక్లరేషన్ను విడుదల చేస్తారని తెలిసింది. జాబితాలో వివిధ పార్టీలకు చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు సహా పలువురు కీలక నేతలు ఉన్నారు. విడతల వారీగా చేరికలు ఉండేలా నాయకత్వం వ్యూహరచన చేసి ఉంటుంది. ఎన్నికల నాటికి పార్టీని మరింత బలపరిచేలా ప్లాన్ చేసుకుంటుంది.