బెయిల్ పిటిషన్పై మరోసారి హైకోర్టును ఆశ్రయించిన రవిప్రకాశ్
హైదరాబాద్ : టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాశ్ మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. టీవీ 9లో ఫోర్జరీకి పాల్పడ్డారనే అభియోగాలపై సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. రవిప్రకాశ్, నటుడు శివాజీకి నోటీసులు ఇచ్చినా వారు స్పందించలేదు. ఐపీసీ, సీఆర్పీసీ, ఇతర సెక్షన్ల కింద మూడు పర్యాయలు నోటీసులు జారీచేశారు. అయినా వారు విచారణకు హాజరుకాకపోవడంలో లుక్ అవుట్ నోటీసులు జారీచేసిన సంగతి తెలిసిందే.
లుక్ అవుట్ నోటీసులు ..
రవిప్రకాశ్ .. దేశం విడిచి వెళ్లకుండా ఉండేందుకు లుక్ అవుట్ నోటీసులు జారీచేశారు. దీంతో దేశంలోని అన్ని ఎయిర్ పోర్టన్లు అలర్ట్ చేశారు. మరోవైపు రవిప్రకాశ్ పాస్ పోర్టును పోలీసులు సీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇవాళ మరోసారి హైకోర్టులో రవిప్రకాశ్ తరఫు న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. సైబర్ క్రైమ్ పోలీసులు నమోదుచేసిన కేసులపై ముందస్తు బెయిల్ ఇవ్వాలని పిటిషన్లో కోరారు. ఈ పిటిషన్ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. బుధవారం విచారిస్తామని హైకోర్టు ధర్మాసనం స్పష్టంచేసింది.

రెండోసారి ...
అలంద మీడియాలో నిధుల మళ్లింపు, ఫోర్జరీకి పాల్పడ్డారనే అభియోగాలపై ఇప్పటికే ఆయన ఓసారి హైకోర్టును ఆశ్రయించారు. అయితే ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. తాజాగా మరోసారి పిటిషన్ దాఖలు చేయడం, విచారణకు స్వీకరించడంతో ఈసారైనా ఊరట కలుగుతుందేమోనని రవిప్రకాశ్ భావిస్తున్నారు. అయితే అతనికి రిలీఫ్ కలిగేది లేదనే అంశం బుధవారం విచారణ సందర్భంగా తెలియనుంది.












Click it and Unblock the Notifications