48 డిగ్రీలకు చేరువలో టెంపరేచర్.. 46 ఏళ్ల నాటి రికార్డు బ్రేక్ అయ్యేనా..!
Recommended Video
హైదరాబాద్ : మండుతున్న ఎండలు జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గుక్క తిప్పుకోనివ్వకుండా చెమటలు కక్కిస్తున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం 10 గంటలకే ఎండ తాలూకు ఉక్కపోత కుదురుగా ఉండనివ్వడం లేదు. కూలర్లు పెట్టుకున్నా కూడా వేడి భరించడం కష్టంగానే ఉంటోంది. ఈ ఏడాది నమోదవుతున్న హై టెంపరేచర్ ఇటీవల కాలంలో ఎన్నడూ లేదు. అప్పుడెప్పుడో 46 సంవత్సరాల కిందట రికార్డయిన అత్యధిక ఉష్ణోగ్రతలు.. ఈ సంవత్సరం నమోదు కానుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
మండుటెండలు.. భగభగ మంటలు
రికార్డు స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలతో జనాలు కలవరపడుతున్నారు. ఎండ వేడిమి తట్టుకోలేక పరేషాన్ అవుతున్నారు. భానుడి ప్రతాపంతో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండుటెండల కారణంగా మధ్యాహ్నం బయటకు వెళ్లలేని పరిస్థితి. వేడి గాలుల కారణంగా చెమట చుక్కలు చికాకు తెప్పిస్తున్నాయి. పనులన్నీ వాయిదా వేసుకుని ఇంట్లో ఉంటున్న కూడా సమ్మర్ హీట్ తిప్పలు తప్పడం లేదు.
వాయవ్య రాష్ట్రాల నుంచి వస్తున్న వేడిగాలులతోనే రాష్ట్రం భగభగ మండిపోతోంది. అప్పుడెప్పుడో 46 ఏళ్ల కింద ఇలాంటి సిట్యువేషన్ కనిపించింది. ఇప్పుడు అదే స్థాయిలో ఎండలు దంచికొడుతుండటంతో జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇక రానున్న రోజుల్లో టెంపరేచర్ మరింత అధికంగా ఉండొచ్చనేది వాతావరణ శాఖ అంచనా.
ఆనాటి రికార్డు ఈసారి కూడానా?
1973లో ఇలాగే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయినట్లు తెలుస్తోంది. ఆ సంవత్సరం మే నెల 9వ తారీఖున 48.6 డిగ్రీల టెంపరేచర్ నమోదైనట్లు వాతావరణ శాఖ రికార్డులు చెబుతున్నాయి. అంటే ఈ 46 ఏళ్లలో అదే అత్యధిక ఉష్ణోగ్రత అన్నమాట. ఇక 2018లో చూసినట్లయితే 7 రోజులు మాత్రమే హై టెంపరేచర్ నమోదైంది. ఈ ఏడాది ఇప్పటిదాకా 46.3 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత రికార్డయింది. సింగరేణి కోల్ బెల్ట్ ఏరియాల్లో మాత్రం దాదాపు రెండు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటున్నాయి.
మే నెలలో ఇప్పటికే ఒక వారం గడిచిపోయింది. ఇక మిగిలింది మరో మూడు వారాలు. అయితే ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉండటంతో రోజులెలా గడుస్తాయోనని లెక్కపెట్టుకోవాల్సిన పరిస్థితి. ఇప్పటివరకైతే 46.3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదైనప్పటికీ.. రాను రాను ఇది 47 నుంచి 48 డిగ్రీలకు చేరే అవకాశముందనేది వెదర్ డిపార్టుమెంట్ అధికారుల మాట. ఒకవేళ 48 డిగ్రీలకు చేరితే మాత్రం 46 ఏళ్ల నాటి రికార్డుకు చేరువైనట్లే. 48.6 డిగ్రీలు దాటితే రికార్డు బ్రేక్ చేసినట్లే.
వడగాల్పులతో పరేషాన్.. ఒక్కరోజే 5 మంది..!
పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనాలు నానా తిప్పలు పడుతున్నారు. వడగాల్పులతో ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే మరో మూడు రోజుల్లో తూర్పు, ఉత్తర తెలంగాణలోని కొన్ని ఏరియాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశముందని అంటున్నారు నిపుణులు. అదలావుంటే వేడిగాలులకు మంగళవారం (07.05.2019) నాడు ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా ఐదుగురు వ్యక్తులు చనిపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందేలా కొన్ని జాగ్రత్తలు తీసుకుని మరో 20 రోజుల పాటు జాగ్రత్తగా ఉంటే చాలు.. ఈ ఏడాది వేసవి నుంచి బయటపడొచ్చు. అత్యవసర పనులు ఉంటే తప్ప మధ్యాహ్నం బయటకు వెళ్లకపోవడమే మంచిది. ఇంట్లో ఉన్నా కూడా తగు జాగ్రత్తలు తీసుకుని సమ్మర్ హీట్ ను బ్లాస్ట్ చేయండి.