అడ్డుకోమని చెప్పేందుకు అతనెవరు, మంత్రి కేటీఆర్పై రేవంత్ రెడ్డి గరం గరం..
అసలే కరోనా.. కష్టకాలం.. కొందరికీ తినడానికి తిండి, తాగడానికి నీళ్లు లేని పరిస్థితి. మరికొందరు ఎక్కడినుంచి వచ్చి ఆస్పత్రుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. అలాంటి వారికి సాయం మంచిదే. కానీ తెలంగాణ రాష్ట్రంలో మంచి చేస్తే ప్రభుత్వం, అధికార పార్టీ నేతలే చేయాలి అన్నట్టుంది సిచుయేషన్. గాంధీ ఆస్పత్రి వద్ద రోగులకు భోజనాలు పెట్టడం మంచిదే. బంధువుల కడుపునింపడం మహా పుణ్యం. అలాంటి కార్యాన్ని కూడా అడ్డుకోవడం మంచి పద్దతి కాదు. రేవంత్ రెడ్డి చేపట్టిన పనికి ప్రభుత్వ పెద్దల ఆదేశంతో పోలీసులు బ్రేకులు వేశారు.
బేగంపేట అడ్డుకున్న పోలీసులు
గాంధీ ఆసుపత్రి వద్ద గల రోగుల బంధువులకు భోజనాలు పెట్టడానికి వెళుతున్న మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. బేగంపేట వద్ద అడ్డుకున్న పోలీసులతో రేవంత్ వాగ్వాదానికి దిగారు. ఓ ఎంపీగా తన నియోజకవర్గంలో కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడానికి వెళుతుంటే ఇలా అడ్డుకోవడం ఏంటని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాను లోకల్ ఎంపీని.. తనను ఆపమని చెప్పిందెవరు? మీకు ఆదేశాలు ఎవరిచ్చారో చెప్పండి. ఆ కాగితాలు చూపాలని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
స్థానిక ఎంపీని అడ్డుకుంటారా..?
మీరు మెలకువలో ఉండి మాట్లాడుతున్నారా? ఈ ప్రభుత్వానికి బుర్ర ఉండే మాట్లాడుతుందా... ఇక్కడి ఎంపీని అడ్డుకోవడం ఏంటీ అని అడిగారు. మీ ఆంక్షలు గాంధీ ఆసుపత్రి దగ్గర పెట్టుకోవాలని సూచించారు. బేగం పేటలో కాదని హితవు పలికారు. గాంధీ, సికింద్రాబాద్, బేగంపేట్ తదితర ప్రాంతాల్లో కార్యక్రమాలు పెట్టుకున్నానని.. తనను ఆపమని చెప్పిందెవరు? తను సామాన్య పౌరుడిని కాదు. స్థానిక ఎంపీని అని చెప్పారు. మీరెందుకు రోడ్డు మీదకి వచ్చారు? మీలాగే నేను కూడా రోడ్డు మీదకు ప్రజలకు సేవ చేయడానికి వచ్చానని చెప్పారు. కష్టాల్లో ఉన్న ప్రజల దగ్గరకు వెళుతుంటే ఎందుకు ఆపుతున్నారని రేవంత్ ఫైర్ అయ్యారు.
వెయ్యిమందికి అన్నదానం
గాంధీ ఆసుపత్రి దగ్గర రోగుల బంధువులకు నిత్యం వెయ్యి మందికి అన్నదానం చేసే కార్యక్రమాన్ని శనివారం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. రెండో రోజు ఈ కార్యక్రమాన్ని గాంధీతోపాటు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద కూడా చేపట్టాలని ఎంపీ భావించారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి బేగంపేట పోలీస్ స్టేషన్ సమీపంలో పోలీసులు అడ్డుకున్నారు. ఎంపీ వాహనాన్ని చుట్టుముట్టి ముందుకు కదలనీయలేదు. దీంతో పోలీసులతో రేవంత్ వాగ్వాదానికి దిగారు.
కేటీఆర్ నుంచి ఆదేశాలు..?
అయితే పోలీసులు మాత్రం తమకు మంత్రి కేటీఆర్ నుంచి ఆదేశాలు ఉన్నాయని.. మిమ్మల్ని అనుమతించలేమని చెప్పినట్టు తెలుస్తోంది. అయితే రాతపూర్వక ఆదేశాలు చూపాలని రేవంత్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ తీరును రేవంత్ రెడ్డి తప్పుపట్టారు. పేదవాడి ఆకలిపై రాజకీయాలు చేయడం తగదన్నారు. లాక్ డౌన్ సమయంలో పేదలకు పట్టెడు అన్నం పెట్టడం నేరమా అని ప్రశ్నించారు. గరీబోడి నోటికాడి కూడు లాగేసే ప్రయత్నం మంచి పద్దతి కాదన్నారు. సామాజిక సేవలో రాజకీయాలు వెతికే ప్రయత్నం దుర్మార్గం అని ఖండించారు. సిగ్గుమాలిన రాజకీయాలు అవసరమా కేటీఆర్ అని రేవంత్ రెడ్డి నిలదీశారు.