రామేశ్వరరావుకు రేవంత్ రెడ్డి షాక్: మైహోంతోపాటు సర్కారుకు భూ కేటాయింపులపై హైకోర్టు నోటీసులు
హైదరాబాద్: మైహోం రామేశ్వర్ రావుకు కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డి షాకిచ్చారు. మై హోం రామేశ్వరరావు సంస్థకు చేసిన భూ కేటాయింపులపై హైకోర్టులో రేవంత్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. రాయదుర్గంలో వందల కోట్లు విలువ చేసే భూమిని మైహోంకు కేటాయించారని పిటిషన్లో ఆయన పేర్కొన్నారు.

మైహోంతోపాటు తెలంగాణ సర్కారుకు నోటీసులు..
నిబంధనలకు విరుద్ధంగా రూ. 38 కోట్ల స్టాంప్ డ్యూటీ మినహాయింపు ఇచ్చారని రేవంత్ రెడ్డి వివరించారు. ఈ పిటిషన్ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. రామేశ్వర్ రావు(మైహోం కన్స్ట్రక్చన్)తోపాటు ప్రభుత్వానికి, టీఎస్ఐఐసీ, డీఎల్ఎఫ్ సంస్థకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 4 వారాలపాటు కేసును వాయిదా వేసింది.

నిబంధనలకు విరుద్ధంగా భూ కేటాయింపులు..
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గంలోని 31.35 ఎకరాలను అభివృద్ధి చేసేందుకు నిబంధనలకు విరుద్ధంగా డీఎల్ఎఫ్ రాయ్దుర్గ్ డెవలపర్స్ సంస్థకు కేటాయించారని పిటిషన్లో రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆ తర్వాత డీఎల్ఎఫ్ రాయ్దుర్గ్ డెవలపర్స్ పేరును ఆక్వా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్గా మార్చుకోవాడానికి అనుమతిచ్చారని ఆరోపించారు.

ప్రభుత్వ పెద్దలతో సంబంధాలుండటంతో..
కేటాయించిన భూమికి బదులుగా సమీపంలోని అంతకన్నా ఎక్కువ విలువైన మరో భూమి ఇవ్వాలని ఆక్వా స్పేస్ కోరడంతో.. నిబంధనలకు విరుద్ధంగా అనుమతించారని రేవంత్ తన పిటిషన్లో పేర్కొన్నారు. ప్రభుత్వ పెద్దలతో సన్నిహిత సంబంధాలున్న మైహోం గ్రూప్నకు చెందినది కావడంతో.. ఆక్వా స్పేస్ సంస్థకు అక్రమంగా భూమి కేటాయించారని ఆరోపించారు రేవంత్ రెడ్డి.

భూ కేటాయింపులు రద్దు చేయాలంటూ కోరిన రేవంత్.. కానీ..
భూ కేటాయింపులు రద్దు చేయడంతోపాటు సంబంధిత అధికారులపై విచారణ జరిపేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషన్లో హైకోర్టును కోరారు. కాగా, భూములపై యథాతథస్థితి కొనసాగించేలా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. అయితే, ఈ విషయంపై ప్రతిపవాదులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. రేవంత్ రెడ్డి పిటిషన్తో మరోసారి మైహోం భూముల కేటాయింపు వెలుగులోకి వచ్చినట్లయింది. కాగా, గతంలో కూడా మైహోంకు భూ కేటాయింపులు రేవంత్ రెడ్డి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్పైనా ఆయన ఈ భూముల కేటాయింపుల విషయంలో విమర్శలు గుప్పించారు.












Click it and Unblock the Notifications