బీజేపీకి మీరే మార్గదర్శకులు: కేసీఆర్ లక్ష్యంగా రేవంత్ రెడ్డి విమర్శలు
హైదరాబాద్: సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ కారణంగానే రాష్ట్రంలో బీజేపీ మరింత బలపడుతోందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. పార్టీ నేతలతో కలిసి హైదరాబాద్లోని గాంధీ భవన్లో ఆయన మాట్లాడారు.
మునుగోడు ప్రజలను సీఎం కేసీఆర్ మరోసారి మోసం చేశారన్నారు.
మునుగోడులో శనివారం జరిగిన సభలో ఉపాధి, ప్రాజెక్టులపై మాట్లాడకుండా.. జాతీయ, అంతర్జాతీయ అంశాలపై మాట్లాడారని కేసీఆర్పై మండిపడ్డారు. నిరుద్యోగ యువకులకు ఏ రకంగా ఉపాధి కల్పిస్తారో చెప్పలేదని ధ్వజమెత్తారు. నిన్నటి సభలో సీఎం కేసీఆర్ మునుగోడుకు ఏం చేశారో.. ఏం చేస్తారో చెప్పలేదని విమర్శించారు.

రాజగోపాల్ రెడ్డి కోట్ల రూపాయలు కేసీఆర్కు సహాయం చేసినట్లు చెప్పారని, ఇద్దరి మధ్య ఉన్న రహస్య ఒప్పందం ఏంటి? ఎందుకు సహాయం చేశారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు రేవంత్. దానిని రాజగోపాల్ రెడ్డి ఆదాయపుపన్ను లెక్కల్లో చూపెట్టారా? అని నిలదీశారు. రాజగోపాల్ రెడ్డి ఆరోపణలపై కేసీఆర్ వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఎప్పటిలోగా డిండి ప్రాజెక్టు పూర్తి చేస్తారో చెప్పలేదన్నారు. పోడు భూముల సమస్యను ఎలా తీరుస్తారో చెప్పలేదని మండిపడ్డారు.
చర్లగూడెం, కిస్టరాయపల్లి భూ నిర్వాసితుల సమస్యను ప్రస్తావించలేదని రేవంత్ ధ్వజమెత్తారు. పార్టీ ఫిరాయింపులకు ఆద్యులు కేసీఆరే.. బీజేపీకి మీరే ఆదర్శమని చురకలంటించారు. పార్టీల విలీనానికి కిటికీలు తెరిచింది మీరు కాదా అని ప్రశ్నించారు. ఏకలింగంగా ఉన్న బీజేపీని మూడు తోకలు చేసింది నువ్వే కదా అని కేసీఆర్పై విమర్శలు గుప్పించారు. లేని బీజేపీని ప్రత్యామ్నాయంగా సృష్టించింది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. కాగా, మునుగోడులో సిట్టింగ్ సీటును దక్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది.












Click it and Unblock the Notifications