సమ్మె ఎఫెక్ట్ : అద్దె, స్కూల్ బస్సులతో రవాణా అధికారుల ఏర్పాట్లు
తెలంగాణ ఆర్టీసీ కార్మీకులు శనివారం నుండి సమ్మెకు దిగుతామని నోటీసులు ఇవ్వడంతో పాటు దూర ప్రాంతాలకు వెళ్లే బస్సులను ఇప్పటికే నిలిపివేశారు. దీంతో ప్రయాణికులకు ఇబ్బందులు కల్గకుండా ఇటు ప్రభుత్వ అటు ఆర్టీసీ అధికారులు ప్రత్యామ్నాయా ఏర్పాట్లపై దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే అద్దె బస్సులతో పాటు ప్రయివేట్ బస్సుల్లో ప్రయాణికులను చేరవేయాలని నిర్ణయించారు. అయితే అద్దె బస్సులను ఒకవేళ కార్మీకులు అడ్డుకుంటే వాటికి పోలీసుల రక్షణ కూడ కల్పించాలని నిర్ణయించారు.
అద్దె బస్సులు రంగంలోకి
సమ్మె నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం వేసిన త్రిసభ్య కమిటీ సమావేశం అయింది. ఇప్పటికే కార్మీకులను సమ్మె విరమించాలని విజ్ఝప్తి చేసిన కమిటీ అందుకు అనుగుణంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేసేందుకు రంగం సిద్దం చేసింది. ఇందులో భాగంగానే ప్రస్తుతానికి ఆర్టీసీలో ఉన్న 2100 అద్దె బస్సులను నడపుతామని త్రిసభ్య కమిటీ సభ్యుడు సునిల్ శర్మ ప్రకటించారు. ఇందుకోసం తాత్కాలిక పద్దతిన మూడు వేల మంది డ్రైవర్లను భర్తి చేస్తామని చెప్పారు. అత్యవసర నోటిఫికేషన్ ఇచ్చి సిబ్బందిని భర్తి చేస్తామని చెప్పారు.
స్కూల్ బస్సులు, ప్రైవేట్ వాహానాలు
ఇక అద్దె బస్సులు కూడ ఆర్టీసీలో అంతర్భగంగా నడుస్తున్న నేపథ్యంలోనే వాటిని అడ్డుకునేందుకు కార్మీకులు ప్రయత్నించే అవకాశాలు ఉండడంతో పోలీసుల సహకారం తీసుకోవాలని నిర్ణయించారు. ప్రతి అద్దె బస్సులో పోలీసులను పెట్టాలని నిర్ణయించారు. వీటితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 20 వేల స్కూల్, బస్సులను కూడ రంగంలోకి దింపనున్నారు. మరోవైపు సర్వీసులు పెంచాలని ఓలా, ఉబెర్, మెట్రో సంస్థలను కోరినట్టు అధికారులు చెప్పారు.. సర్వీసులను పెంచడంతోపాటు ఎక్కువ ఛార్జ్ చేయొద్దని మెట్రో, ఓలా, ఉబెర్ సంస్థలకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
కార్మీకులపై కఠిన చర్యలు
ఇక ఇప్పటికే మూడు సార్లు కార్మీకులతో చర్చలు జరిపిన త్రిసభ్య కమిటీ సభ్యులు సమ్మెలోకి వెళుతున్న కార్మీకులకు హెచ్చరికలు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. అవసరమైతే కార్మీకులను విధుల్లోంచి తొలగిస్తామని చెప్పారు. ఈనేపథ్యంలోనే తెలంగాణ ఏర్పడ్డాక ప్రభుత్వం నుంచి ఆర్టీసీకి రూ. 3,303 కోట్ల ఆర్థిక సాయం అందిందని వివరించారు.. మూడేళ్లుగా బడ్జెట్లో పెట్టిన దాని కంటే ఎక్కువ నిధులు ఆర్టీసీకి ఇస్తున్నామని అన్నారు.. సమస్యలను అధ్యయనం చేసి, శాశ్వతంగా పరిష్కరించేందుకు తాము ప్రయత్నిస్తున్నామని చెప్పారు.. పండుగ వేళ ప్రజలను ఇబ్బంది పెట్టి సంస్థపై చెడు అభిప్రాయం కలిగేలా చేయొద్దని ఆయన త్రిసభ్య కమిటీ అధ్యక్షుడు సోమేష్ కుమార్ విజ్ఝప్తి చేశారు.