గుడ్ న్యూస్.. రేపటి నుంచి రైతుబంధు జమ, ఎకరా భూమి నుంచి
రైతులకు గుడ్ న్యూస్.. రైతు బంధు నగదు వారి ఖాతాల్లో జమకానుంది. మంగళవారం నుంచి రైతుబంధు నిధులు రైతుల ఖాతాల్లో జమ అవుతాయి. సీఎం కేసీఆర్కు రైతుల పక్షాన వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. 68.10 లక్షల మంది రైతుబంధుకు అర్హులు అని తెలిపారు. కోటి 50 లక్షల 43 వేల 606 ఎకరాలకు సాయం అందనుంది. రూ.7 వేల 521.80 కోట్లు పంపిణీ చేయనున్నారు. ఒక ఎకరా నుండి ఆరోహణ క్రమంలో రైతుల ఖాతాల్లో జమ చేస్తారు.
అర్హుల వివరాలను సీసీఎల్ఏ వ్యవసాయ శాఖకు అందించిన సంగతి తెలిసిందే. ఎకరాల వారీగా బిల్లుల జాబితా రూపొందించి ఆర్థికశాఖకు వ్యవసాయ అందించింది. వానాకాలం రైతుబంధు నిధుల పంపిణీకి ప్రభుత్వం సిద్ధం చేసింది. తొలిసారి రైతుబంధు తీసుకునే రైతులు వెంటనే క్షేత్రస్థాయిలో సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులను కలిసి పట్టాదార్ పాస్ బుక్, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు అందించి నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
రైతుల మీద అభిమానంతో రైతుబంధు నిధుల విడుదలకు సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారని మంత్రి తెలిపారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న పత్తి, కంది, ఇతర అపరాలు, నూనెగింజల పంటల సాగుపై రైతులు దృష్టిసారించాలని సూచించారు. జులై 15వ తేదీ వరకు పత్తి విత్తుకునే అవకాశం ఉన్నందున రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
వర్షాలు కొంత ఆలస్యమైనందున తేలిక నేలల్లో 5 నుండి 6.5 సెంటీమీటర్లు, బరువు నేలల్లో 6 నుండి 7.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైన తర్వాతనే రైతులు వర్షాధార పంటలను విత్తుకోవాలని మంత్రి సూచించారు.