16 నుంచి బడులు షురూ.. కరోనా తగ్గుముఖం పట్టడంతో...
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టింది. కేసులు గణనీయంగా తగ్గాయి. దీంతో రాష్ట్రంలో విద్యాసంస్థలు పున:ప్రారంభమ్యే అవకాశం కనిపిస్తోంది. విద్యాశాఖ ఉన్నతాధికారులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు. విద్యా సంస్థల పున: ప్రారంభంపై చర్చించారు. ఇంటర్, పాఠశాలల ఆన్ లైన్ తరగతుల నిర్వహణ గురించి చర్చించారు. ఈ ఏడాది విద్యా సంస్థల ప్రారంభానికి ముహుర్తం ఖరారయిందని విశ్వసనీయంగా తెలిసింది.
స్కూల్స్, ఇంటర్ ఆన్ లైన్ తరగతుల నిర్వహణపై చర్చ సర్వత్రా జరుగుతోంది. విద్యా సంస్థల ప్రారంభానికి తేదీ కూడా ఖరారైంది. ఈ నెల 16 నుంచి విద్యాసంస్థల ప్రారంభానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. 8,9,10 తరగతులకు ఆన్ లైన్ క్లాసులు నిర్వహించే యోచనలో విద్యాశాఖ ఉన్నట్టు సమాచారం. మరోవైపు.. తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ మరో 10 రోజులు పొడిగించిన ప్రభుత్వం.. ఆంక్షలను కూడా సడలించిన సంగతి తెలిసిందే.
ఇప్పటివరకూ ఉన్న ఆంక్షల సమయాల్లో మార్పులు చేసింది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆంక్షలను సడలించారు. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకూ లాక్ డౌన్ కొనసాగనుంది. రాష్ట్రంలో కర్ఫ్యూను పక్కాగా అమలు చేయనుంది. మంగళవారం కేబినెట్ సమావేశంలో లాక్ డౌన్ పొడిగింపుపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సాయంత్రం 5 గంటల తర్వాత ఓ గంట పాటు ఇళ్లకు వెళ్లేందుకు వెసులుబాటు కల్పించారు. రేపటి నుంచి కొత్త ఆంక్షలు అమల్లోకి రానున్నాయి.
ఇటు 16వ తేదీ నుంచి స్కూల్స్ ఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. తరగతి గదుల్లో ఆ మేరకు చర్యలు తీసుకుంటారు. శానిటైజ్ చేయడం.. విధిగా మాస్క్ ధరించడం.. దినం తప్పి దినం పిల్లలు స్కూల్ వచ్చేలా ఏర్పాట్లు చేసే అవకాశం ఉంది.