మోడీతో కిషన్ రెడ్డి చనువు.. సెంట్రల్ కేబినెట్లో కుర్చీ
హైదరాబాద్ : తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. నాలుగు స్థానాల్లో కాషాయం జెండా రెపరెపలాడి బీజేపీ బలమేంటో చూపింది. ఆ నేపథ్యంలో తెలంగాణ వైపు బీజేపీ హైకమాండ్ ప్రత్యేక దృష్టి సారించింది. ఆ క్రమంలోనే కేంద్ర మంత్రివర్గంలో తెలంగాణకు సముచిత ప్రాధాన్యం కల్పించడానికి సిద్ధమైనట్లు సమాచారం.
తెలంగాణలో బీజేపీని మరింత బలోపేతం చేసే దిశగా ఢిల్లీ పెద్దలు దృష్టి సారించారు. ఆ క్రమంలో సికింద్రాబాద్ నుంచి ఎంపీగా గెలిచిన కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రివర్గంలో అవకాశం కల్పించారు.
కిషన్ రెడ్డి అనే నేను..!
సికింద్రాబాద్ నుంచి బీజేపీ ఎంపీగా గెలిచిన కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రి పదవి కన్ఫామ్ అయింది. ఆ మేరకు ప్రధానమంత్రి కార్యాలయంతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నుంచి ఆయనకు ఫోన్ కాల్ వచ్చింది. గురువారం (30.05.2019) సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా కిషన్ రెడ్డి కూడా ప్రమాణం చేసే అవకాశముంది.
అయ్యో బాలయ్య.. నీ తిప్పలు ఏందయ్యా.. ఈసారి అల్లుడి దారి తొక్కారుగా..!
తెలంగాణకు ప్రాధాన్యం ఇవ్వడానికేనా?
ఇదివరకు సికింద్రాబాద్ నుంచి బీజేపీ ఎంపీగా గెలిచిన బండారు దత్తాత్రేయకు కేంద్ర మంత్రి పదవి దక్కింది. అయితే అనూహ్యంగా మధ్యలో ఆ పదవి నుంచి తొలగాల్సి వచ్చింది. ఇక అప్పటినుంచి తెలంగాణకు కేంద్ర మంత్రివర్గంలో ప్రాధాన్యం లేనట్లయింది. అదలావుంటే తాజాగా జరిగిన లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి బీజేపీ జెండా రెపరెపలాడటంతో కేంద్ర మంత్రివర్గంలో రాష్ట్రానికి సముచిత ప్రాధాన్యం ఇవ్వాలనే కారణంతో కిషన్ రెడ్డికి కేంద్రమంత్రి కన్ఫామ్ చేసినట్లు తెలుస్తోంది.
పార్టీశ్రేణుల్లో, అభిమానుల్లో ఆనందం
ఇక సౌత్ ఇండియా వైపు దృష్టి సారించిన బీజేపీ అగ్ర నాయకత్వం.. తెలంగాణ వైపు ఓ కన్నేసింది. మొన్నటి లోక్సభ ఎన్నికల్లో నాలుగు స్థానాలు గెలవడం ఆ పార్టీకి జవసత్వాలు నింపినట్లైంది. దాంతో తెలంగాణలో మరింత బలపడాలనే తాపత్రయం కనిపిస్తోంది. అందుకే బీజేపీని తెలంగాణలో బలోపేతం చేసే దిశగా కిషన్ రెడ్డికి పట్టం కట్టినట్లు అర్థమవుతోంది.
అదలావుంటే ప్రధాని నరేంద్ర మోడీతో కిషన్ రెడ్డికి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. మోడీ దగ్గర అత్యంత చనువుంది. బీజేవైఎం జాతీయ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి పనిచేసిన సమయంలో మోడీకి దగ్గరయ్యారనే ప్రచారముంది. అప్పట్లో బీజేపీ జాతీయ నేతలంతా కలిసి పర్యటించిన నేపథ్యంలో మోడీ, కిషన్ రెడ్డి ఓకే రూములో బస చేసిన సందర్భం కూడా ఉంది. అలా వారిద్దరి మధ్య మంచి సన్నిహిత సంబంధాలు మెరుగుపడ్డాయి. అలా కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రి పదవి దక్కడానికి అది కూడా ఒక కారణమనే వాదన ఉంది. మొత్తానికి కేంద్ర మంత్రి పదవికి కిషన్ రెడ్డి పేరు ఖరారు కావడంతో పార్టీశ్రేణుల్లో, ఆయన అభిమానుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.
మంత్రిగా ప్రజాసేవకు అంకితమవుతా.. గెలిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు
కేంద్రమంత్రిగా తనకు అవకాశం రావడంపై కిషన్ రెడ్డి స్పందించారు. తనకు అప్పజెప్పే బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తానని చెప్పారు. కేంద్ర ప్రభుత్వంలో తెలంగాణకు భాగస్వామ్యం కల్పించినందుకు నరేంద్ర మోడీకి, అమిత్ షా కు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలో బీజేపీ బలోపేతానికి శాయశక్తులా కృషి చేస్తానని.. తనను గెలిపించి మంత్రిగా ప్రజాసేవకు అంకితం కావడానికి అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.