ఏడో నిజాం కూతురు బషీరున్నీసాబేగం కన్నుమూత
హైదరాబాద్: ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ కూతురు సాహెబ్జాదీ బషీరున్నీసాబేగం(93) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్ పురానీహవేలీ నిజాం మ్యూజియం ఆవరణలోని ఉస్మాన్ కాటేజ్ భవనంలో తుదిశ్వాస విడిచారు.
బషీరున్నీసాబేగం భౌతిక కాయాన్ని పురానీహవేలీ సమీప మసీదుకు తరలించి జనాజా నమాజ్ నిర్వహించారు. నిజాం మనవడు నవాబ్ నజాఫ్ అలీఖాన్, మ్యూజియం డైరెక్టర్ ఱఫత్ హుస్సేన్ బేగం, క్యూరేటర్ అహ్మద్ అలీ, నిజాం కుటుంబసభ్యులు, వారి సన్నిహితులు సంతాపం వ్యక్తం చేశారు.

కాగా, ఏడో నిజాంకు 21 సంవత్సరాల వయస్సులో 1906 ఏప్రిల్ 14న ఆజం ఉన్నీసాబేగంతో వివాహమైంది. ఆయనకు మొత్తం 34 మంది సంతానం. ఏడో నిజాం సంతానంలో ఇప్పటి వరకు జీవించి ఉన్నది ఆమె ఒక్కరే. బషీరున్నీసాబేగం 1927లో జన్మించారు.
దక్కన్ హైదరాబాదీ సంస్కృతిని ప్రతిబింబించేలా నగలు ధరించేవారు. ఈమె భర్త నవాబ్ ఖాజీంయార్ జంగ్ చాలా కాలం క్రితమే మరణించారు. ఆమెకు ఒక కుమార్తె షహెబ్ జాదీ రషీదున్నీసా బేగం, కుమారుడు ఉన్నారు. కుమారుడు సుమారు పాతికేళ్ల క్రితం తప్పిపోయారు. ఇప్పటి వరకు అతని ఆచూకీ లభించలేదు.












Click it and Unblock the Notifications