Severe Rainfall Alert: తెలంగాణలో మళ్లీ 3 రోజులు వర్షాలు..
తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజులుగా వాతావరణం పూర్తిగా మారిపోయింది. కొన్ని చోట్ల వర్షాలు కూడా కురిశాయి. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో.. శ్రీలంక సమీపంలో కొమరీన్ ప్రాంతంపై అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తీరం వరకు వ్యాపించి ఉన్న ఉపరితల ఆవర్తనం కొంచెం బలహీన పడింది. వీటి ప్రభావంతో మూడు రోజుల పాటు తెలంగాణలో పలు చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
వాతావరణ మార్పుల వల్ల.. వర్షం కురిసి తెలంగాణలో రైతులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. వరి ధాన్యం బస్తాలు చాలా చోట్ల తడిసిపోయాయి. పండిన పంట మార్కెట్కు వెళ్లాల్సిన సమయంలో వర్షం కురవడంతో రైతులు నష్టపోయారు. కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు భారీ వర్ష సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. కర్ణాటకలో వర్షం దంచికొట్టింది.

జోరు వానకు బెంగళూరులో రోడ్లు జలమయం అయ్యాయి. నీరు నిలువడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. దీంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. పీవీపురంలో 126 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఇక బెంగళూరు సౌత్ జోన్లో అత్యధికంగా 134.5 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆర్ఆర్ నగర్, మహాదేవపురలో వర్షంతో రోడ్లు చెరువులను తలపించాయి.
పంట చేతికి వచ్చే సమయంలో కురవనున్న వర్షాలతో రైతులు ఇబ్బందులు పడతారు. ఇప్పటికే వరి పంట చేతికి వచ్చింది. వర్షాలు పడటంతో.. నీటితో తడిగా ఉంటుంది. దీంతో మిషన్ల ద్వారా కోత మరింత కష్టం అవుతుంది. వరుణ దేవ తమను కరుణించు అని అన్నదాతలు వేడుకుంటున్నారు. ఇటు గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది వర్షపాతం ఎక్కువే నమోదు అవుతుంది. ఇప్పటికే ప్రాజెక్టులు నిండుకుండను తలపిస్తున్నాయి. వర్ష బీభత్సం ఇలానే కొనసాగితే.. ప్రాజెక్టులు గరిష్ట నీటిమట్టానికి చేరుకునే అవకాశం ఉంది. పంటలకు వానాకాలం, యాసంగి పంటలకు నీరు సమృద్ధిగా లభించే పరిస్థితులు ఉన్నాయి.












Click it and Unblock the Notifications