రోడ్ యాక్సిడెంట్ అనుకున్నారు... కానీ అసలు నిజం వేరే... ఉపాధ్యాయుడి మృతి కేసులో షాకింగ్ విషయాలు
రాజేంద్ర నగర్ పరిధిలో బుధవారం(మార్చి 10) అర్ధరాత్రి తర్వాత చోటు చేసుకున్న ఓ యాక్సిడెంట్ కేసులో సంచలన నిజాలు వెలుగుచూశాయి. మొదట అతను రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని భావించినప్పటికీ... మెడపై కత్తితో కోసిన గాయాలు ఉండటంతో పోలీసులకు అనుమానం కలిగింది. కేసును లోతుగా విచారించగా తెలిసిన వ్యక్తే అతన్ని హత్య చేసినట్లు తేలింది. ఆర్థిక లావాదేవీల విషయంలో ఇద్దరి మధ్య నెలకొన్న గొడవలే ఇందుకు కారణమని పోలీసులు తేల్చారు.

అసలేం జరిగింది....
మహబూబ్నగర్కి చెందిన నరహరి(40) అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడికి రెండేళ్ల క్రితం రాజేంద్ర నగర్కి చెందిన జగదీశ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. జగదీశ్ స్వస్థలం పెద్దపల్లి జిల్లా మంథని కాగా... పదేళ్ల క్రితం రాజేంద్రనగర్ వచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో స్థిరపడ్డాడు. నరహరితో ఉన్న పరిచయంతో ఏడాది క్రితం జగదీశ్ అతని నుంచి రూ.1కోటి వరకు అప్పు తీసుకున్నాడు. అయితే ఆ అప్పును సకాలంలో తిరిగి చెల్లించలేకపోయాడు. దీంతో నరహరి నుంచి డబ్బుల కోసం ఒత్తిడి మొదలైంది.

ఆరోజు సాయంత్రం జగదీశ్ ఇంటికి
బుధవారం(మార్చి 10) సాయంత్రం నరహరి రాజేంద్రనగర్లోని జగదీశ్ ఇంటికి వెళ్లి బాకీ డబ్బుల గురించి నిలదీశాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య కొద్దిగంటల పాటు వాదోపవాదనలు జరిగాయి. చివరకు జగదీశ్ ఓ తేదీ చెప్పి... ఆలోగా డబ్బులు ఇస్తానని హామీ ఇచ్చాడు. ఒకవేళ ఆలోగా ఇవ్వకపోతే... బాలానగర్లో తనకున్న ప్లాట్ను ఇచ్చేస్తానని చెప్పాడు. అప్పటికే దాదాపు అర్ధరాత్రి సమయం కావొచ్చింది. జగదీశ్ మాట మీద నమ్మకంతో నరహరి ఇక తిరిగి ఇంటికి బయలుదేరాడు.

బైక్ను ఢీకొట్టిన కారు...
నరహరి తన బైక్పై స్థానిక భగీరథ కాలనీకి చేరుకున్న సమయంలో గుర్తు తెలియని కారు అతని బండిని ఢీకొట్టింది. కొద్దిసేపటికి స్థానికులు గమనించగా నరహరి అక్కడ రక్తపు మడుగులో పడి వున్నాడు. దీంతో స్థానికులు పోలీసులకు ఫోన్ చేసి రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడని సమాచారమిచ్చారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు మొదట అది యాక్సిడెంట్ కేసే అనుకున్నారు. కానీ అతని గొంతుపై గాయాలు ఉన్నట్లు కనిపించడంతో వారికి అనుమానం కలిగింది.

చంపింది జగదీశే..?
గొంతు భాగాన్ని నిశితంగా గమనించగా పదునైన ఆయుధంతో పీక కోసినట్లు తెలిసింది. మృతుడు నరహరి కుటుంబ సభ్యులను ఆరా తీయగా ఆరోజు అతను జగదీశ్ ఇంటికి వెళ్లినట్లు తెలిసింది. దీంతో జగదీశ్ను విచారించే ప్రయత్నం చేయగా అతను అందుబాటులోకి రాలేదు. అయితే ప్రాథమిక అంచనా ప్రకారం జగదీశే హత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇద్దరి మధ్య ఉన్న ఆర్థిక లావాదేవీల వివాదమే హత్యకు కారణమని అనుమానిస్తున్నారు. మొదట కారుతో ఢీకొట్టిన జగదీశ్... నరహరి కింద పడిపోవడంతో వెంటనే కత్తితో దాడి చేసి పారిపోయి ఉంటాడని భావిస్తున్నారు. నరహరి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు జగదీశ్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications