హైదరాబాద్ మెట్రో రైలు సేవల్లో అంతరాయం: ప్రయాణికులకు ఇబ్బందులు
హైదరాబాద్: నగరంలో మెట్రో రైలు సేవలకు అంతరాయం ఏర్పడింది. సాంకేతిక సమస్యలు తలెత్తడంతో మరోసారి కొద్ది సమయంపాటు మెట్రో రైలు సేవలు నిలిచిపోయాయి. ఎల్బీనగర్-మియాపూర్, నాగోల్-రాయదుర్గం కారిడార్లలో సాంకేతిక సమస్య తలెత్తింది.
దీంతో ఆ మార్గంలో రైళ్లు ముందుకు కదల్లేదు. అసెంబ్లీ-అమీర్పేట మార్గంలో మెట్రో సేవలు స్తంభించిపోయాయి. సాంకేతిక కారణాలతో 30 నిమిషాలపాటు అధికారులు మెట్రో సేవలను నిలిపివేశారు. ఈ క్రమంలోనే అమీర్పేట్ వైపు వెళ్లే మెట్రో రైలును అసెంబ్లీ స్టేషన్ వద్ద నిలిపివేశారు.
కార్యాలయాలకు వెళ్లాల్సిన ఉద్యోగులు, ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. మెట్రో సేవలు అర్ధాంతరంగా నిలిచిపోవడంతో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. సమస్యను వెంటనే పరిష్కరించకపోవడంపై ప్రయాణికులు మెట్రో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా, కరోనా మహమ్మారి కారణంగా స్తంభించి పోయిన మెట్రో రైలు సేవలు ఇటీవలే ప్రారంభమైన విషయం తెలిసిందే. దీంతో ప్రయాణికులు మెట్రోలోనే ప్రయాణించేందుకు ఎక్కువ మొగ్గుచూపారు. కరోనా నిబంధనలను పాటిస్తూనే ప్రయాణికులను మెట్రో రైళ్లల్లోకి అనుమతిస్తున్నారు.