కొత్త సంవత్సర సందర్భంగా కిటకిటలాడిన చర్చీలు, ఆలయాలు
Recommended Video
తెలుగు రాష్ట్రాల్లో నూతన సంవత్సర వేడుకలు చాలా ఘనంగా ప్రారంభమయ్యాయి. డిసెంబర్ 31 సాయంత్రం నుంచే చిన్న పెద్దా అని తారతమ్యం లేకుండా న్యూఇయర్ వేడుకలకు గ్రాండ్గా వెల్కం చేసేందుకు అంతా ఎదురు చూశారు. అర్థరాత్రి 12 గంటలు అవ్వగానే బాణా సంచా పేల్చి సంబురాలు జరుపుకున్నారు. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలిపుకున్నారు.
కొత్త సంవత్సర వేడుకలకు పలు ఆలయాలు చర్చీలు ముస్తాబయ్యాయి. చర్చీలో క్రైస్తవులు కొత్త సంవత్సరం సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సనత్ నగర్లోని సెయింట్ పాల్ చర్చిలో కొత్త సంవత్సర వేడుకలు చాలా గ్రాండ్గా ప్రారంభమయ్యాయి.రాత్రి 9 గంటల నుంచే క్రైస్తవులు చర్చికి వెళ్లి ప్రత్యేక ప్రార్థనల్లో నిమగ్నమయ్యారు. దైవ వాక్యాన్ని పటించి ప్రార్థనలో గడిపారు. అనంతరం ఒకరికొకరు న్యూఇయర్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. స్వీట్లు పంచుకున్నారు. ఎప్పటిలాగే చర్చిలో ఇచ్చే ప్రామిస్ కార్డు తీసుకున్నారు. రాత్రంతా పిల్లల నుంచి పండు ముసలి వరకు ప్రార్థనలు చేస్తూ చర్చీలోనే గడిపారు.
ఇక అదే ప్రాంతంలోని ఆలయాలు కూడా భక్తులతో కిటకిటలాడాయి. చాలామంది భక్తులు కొత్త సంవత్సరం సందర్భంగా తమ ఇష్ట దైవానికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ప్రసాదాలు స్వీకరించారు. ఆలయానికి వచ్చిన వారికి ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మొత్తానికి సనత్ నగర్ ప్రాంతమంతా కులమత బేధాలు లేకుండా ప్రతి ఒక్కరూ న్యూఇయర్కు గ్రాండ్గా వెల్కం చెప్పారు. పాత జ్ఞాపకాలను వదిలేసి కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు కొందరు తీర్మానించుకున్నారు.