హైదరాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం... అమాంతం గాల్లోకి ఎగిరి.. ఫ్లైఓవర్ పైనుంచి పడి యువకుడి మృతి..
హైదరాబాద్లోని ఎల్బీనగర్ ఫ్లైఓవర్పై మంగళవారం(నవంబర్ 18) ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగంతో దూసుకొచ్చిన ఓ కారు.. ముందు వెళ్తున్న ఓ బైక్ను ఢీకొట్టింది. దీంతో బైక్ డ్రైవ్ చేస్తున్న యువకుడు అమాంతం గాల్లోకి ఎగిరి ఫ్లైఓవర్ పైనుంచి కిందపడిపోయాడు. తీవ్ర గాయాలపాలైన అతన్ని ఆస్పత్రికి తరలించగా... అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురికి కూడా తీవ్ర గాయాలయ్యాయి.

సంఘీ ఆలయానికి వెళ్తుండగా...
హైదరాబాద్లోని ఫతేనగర్కి చెందిన అనూష(20) మంగళవారం(నవంబర్ 17) ఎల్బీనగర్లోని ఓ పరీక్షా కేంద్రంలో పరీక్షకు హాజరుకావాల్సి ఉంది. మేనత్త కుమారుడు ఉదయ్ రాజ్(18) ఆమెను తన బైక్పై పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లాడు. పరీక్ష అనంతరం ఇద్దరు కలిసి బైక్పై సంఘీ ఆలయానికి బయలుదేరారు. ఈ క్రమంలో ఎల్బీనగర్ వైపు నుంచి హయత్ నగర్ వైపు వెళ్తుండగా.. ఎల్బీనగర్ ఫ్లైఓవర్పై ఓ కారు వీరి బైక్ను ఢీకొట్టింది.

ఉదయ్రాజ్ మృతి...
వెనుక నుంచి అతివేగంతో దూసుకొచ్చిన ఓ కారు బైక్ను బలంగా ఢీకొట్టింది. దీంతో ఉదయ్రాజ్ అమాంతం గాల్లోకి ఎగిరి ఫ్లైఓవర్ పైనుంచి కింద పడిపోయాడు. దాదాపు 20 అడుగుల ఎత్తు నుంచి కిందపడటంతో అతని తలకు తీవ్ర గాయాలయ్యాయి.హుటాహుటిన అతన్ని ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ప్రమాదంలో అనూష తలకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఉదయరాజ్ మృతితో అతని కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

మరో బైక్ను కూడా ఢీకొట్టిన కారు...
ప్రమాదానికి కారణమైన కారు.. ఫ్లైఓవర్పై మరో బైక్ను కూడా ఢీకొట్టింది. దీంతో సాయిప్రియ(20),బానోత్ నగేష్(17) అనే మరో ఇద్దరు యువకులు కూడా తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రస్తుతం ఎల్బీనగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వీరు చికిత్స పొందుతున్నారు. మంగళవారం మధ్యాహ్నం 12గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమాచారం అందగానే పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని కారు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications