కాంగ్రెస్ నేత మధుయాష్కీకి అలర్జిక్ రియాక్షన్... ఎయిర్పోర్టులో స్టాంపింగే కారణం...
కరోనా మహమ్మారి నేపథ్యంలో విదేశాల నుంచి భారత్కు వస్తున్నవారికి విమానాశ్రయాల్లో చేతిపై స్టాంపింగ్ వేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల విదేశాల నుంచి వచ్చిన కాంగ్రెస్ సీనియర్ నేత,నిజామాబాద్ మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్కు కూడా ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో చేతిపై స్టాంపింగ్ వేశారు. అయితే స్టాంపింగ్ కోసం ఉపయోగించిన సిరా చర్మంపై కెమికల్ రియాక్షన్ చూపించింది. దీంతో స్టాంపింగ్ వేసిన చోట నల్లగా కమిలిపోయినట్లుగా కనిపిస్తోంది.
Dear @HardeepSPuri Ji, can you please look into the chemical being used at Delhi airport for stamping on passengers coming from abroad? Yesterday I was stamped at @DelhiAirport and this is how my hands look now. pic.twitter.com/Gt1tZvGc8L
— Madhu Goud Yaskhi (@MYaskhi) October 4, 2020
ఈ విషయాన్ని మధుయాష్కీ తన ట్విట్టర్ ద్వారా కేంద్ర పౌర విమానయాన మంత్రి హర్దీప్ సింగ్ దృష్టికి తీసుకెళ్లారు. ఢిల్లీ విమానాశ్రయంలో ఉపయోగిస్తున్న స్టాంపింగ్ ఇంక్ కారణంగా తన చేతికి ఇన్ఫెక్షన్ సోకిందని... ఆ ఫోటోలను ట్విట్టర్లో షేర్ చేశారు. స్టాంపింగ్ కోసం ఉపయోగిస్తున్న సిరాను పరిశీలించాల్సిందిగా కోరారు. యాష్కీ ట్వీట్పై హర్దీప్ సింగ్ వెంటనే స్పందించారు. దీనిపై ఎయిర్పోర్ట్ అధారిటీ ఆఫ్ ఇండియా ఛైర్మన్తో మాట్లాడినట్లు తెలిపారు. తన ట్వీట్ పట్ల కేంద్రమంత్రి సత్వర స్పందనపై మధుయాష్కీ సంతోషం వ్యక్తం చేశారు.
ఢిల్లీ ఎయిర్పోర్ట్ అధికారులు కూడా ఈ వ్యవహారంపై స్పందించారు. జరిగినదానికి చింతిస్తున్నామని... ఇక ఆ సిరాను పక్కనపెడుతున్నామని చెప్పారు. ఈ విషయాన్ని తమ దృష్టికి తీసుకొచ్చినందుకు మధుయాష్కీకి ధన్యవాదాలు తెలియజేశారు.
మధుయాష్కీ ట్వీట్ తర్వాత ట్విట్టర్లో మరికొందరు కూడా తమకూ ఇలాగే జరిగిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి దృష్టికి తీసుకొస్తున్నారు. ఇది కేవలం ఢిల్లీకే పరిమితం కాలేదని అంటున్నారు. ఇటీవల ఒడిశాలోని జార్సుగూడ విమానాశ్రయంలో స్టాంపింగ్ తర్వాత తన చర్మంపై కూడా కెమికల్ రియాక్షన్ వచ్చిందని ఓ మహిళ తన చేతి ఫోటోను ట్విట్టర్లో షేర్ చేశారు.