గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బ్యాలెట్ పద్దతిలోనే .. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటన
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను బ్యాలెట్ విధానం ద్వారానే నిర్వహిస్తున్నట్లుగా రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. కరోనా కారణంగా జిహెచ్ఎంసి ఎన్నికల నిర్వహణపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది . జిహెచ్ఎంసి ఎన్నికల నిర్వహణ పై క్లారిటీ వచ్చేసింది. నిన్నటి దాక ఈవీఎంల తో నిర్వహించాలా లేదా బ్యాలెట్ విధానంలో నిర్వహించాలా అన్న అయోమయానికి రాష్ట్ర ఎన్నికల సంఘం ఫుల్ స్టాప్ పెట్టింది.

రాజకీయ పార్టీల అభిప్రాయం మేరకే నిర్ణయం
అన్ని రాజకీయ పార్టీల నుంచి అభిప్రాయాలు సేకరించిన రాష్ట్ర ఎన్నికల సంఘం మెజారిటీ రాజకీయ పార్టీలు బ్యాలెట్ విధానంతోనే ఎన్నికలను నిర్వహించడం సేఫ్ అని అభిప్రాయం వ్యక్తం చేయడంతో ఎన్నికల సంఘం బ్యాలెట్ విధానంలోనే ఎన్నికలు నిర్వహించనున్నట్లుగా ప్రకటన చేసింది. గ్రేటర్ ఎన్నికల ను ఎలా నిర్వహించాలి అని రాష్ట్ర ఎన్నికల సంఘం జిహెచ్ఎంసి ని కోరగా తమకు ఏ విధానంలో ఎన్నికలు నిర్వహించినా అభ్యంతరం లేదని జిహెచ్ఎంసి స్పష్టం చేసింది .

కరోనా నేపధ్యంలో నిర్ణయం .. బ్యాలెట్ పద్దతిలో ఎన్నికలు
ఈవీఎం ల కంటే బ్యాలెట్ బెటర్ అని చాలామంది భావిస్తున్నారు. బ్యాలెట్ ఉపయోగించినా, ఈవీఎంలతో ఎన్నికలకు వెళ్లినా కరోనా వ్యాప్తి తీవ్రతలో పెద్దగా తేడా ఉండబోదని కొందరు అధికారులు చెబుతున్నారు. ఈవీఎంలను ఉపయోగిస్తే బటన్ ను నొక్క వలసి ఉంటుంది . ఇక ఒకే బటన్స్ ను అందరూ పదే పదే ఉపయోగించడం వల్ల కరోనా వ్యాప్తి జరిగే అవకాశం ఉన్నట్లుగా భావించిన చాలామంది బ్యాలెట్ విధానం పై మొగ్గు చూపారు. అయితే ఈ బ్యాలెట్ విధానంలోనూ ఓటర్లు బ్యాలెట్ పేపర్ పై స్టాంపు వేయాల్సి ఉంటుంది. ఈ విధానంలోనూ కరోనా వ్యాప్తికి అవకాశమున్నట్లుగా పలువురు అభిప్రాయపడుతున్నారు. అయినా ఇది ఈవీఎంలతో పోలిస్తే మెరుగని అంటున్నారు.

గ్రేటర్ లో 40 నుండి 45 వేల వరకు బ్యాలెట్ బాక్స్ ల అవసరం
గ్రేటర్లో బ్యాలెట్ విధానంతో ఎన్నికలు జరిగితే గ్రేటర్లో 150 డివిజన్లలో 40 నుండి 45 వేల వరకు బాక్స్ లు అవసరమవుతాయని తెలుస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 150 డివిజన్లలో ఏడు వేల పోలింగ్ బూత్ లు ఉన్నాయి.గతంలో ఒక పోలింగ్ కేంద్రానికి 14 వందల మంది ఓటర్లు ఉండగా కరోనా కారణంగా ఈసారి ఆ సంఖ్య 750 నుంచి ఎనిమిది వందల మంది ఓటర్లకు తగ్గించాలని అధికారులు భావిస్తున్నారు. ఒక లెక్కన గ్రేటర్ హైదరాబాద్లో ఈసారి 11,500 నుంచి 12 వేల పోలింగ్ బూత్లను కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు గా తెలుస్తుంది. ఏది ఏమైనా ఈసారి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బ్యాలెట్ విధానంలోనే జరగనున్నట్లుగా రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టత ఇచ్చింది.












Click it and Unblock the Notifications