వర్షపు నీటిలో పడుకుని వింత నిరసన తెలిపిన కార్పొరేటర్ ... ఎందుకంటే
గత రెండు రోజుల నుండి హైదరాబాద్ లో రికార్డు స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. ఇక ఈ వర్షాలకు పలు కాలనీలు జలమయమయ్యాయి. నగరవాసులు వర్షాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షంతో జాలమైన కాలనీల వాసులు పడరాని పాట్లు పడుతుంటే ఓ కార్పొరేటర్ సమస్య పరిష్కారం కోసం వినూత్న నిరసన చేపట్టారు.
హయత్ నగర్ డివిజన్లోని సుష్మా సాయి నగర్ గ్రీన్ మిడోస్ కాలనీలో కి వెళ్ళే దారి పూర్తిగా వర్షపు నీటితో నిండిపోయింది. కాలనీ లోపలికి వెళ్లేందుకు దారి లేక కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే స్థానిక కార్పొరేటర్ సామ తిరుమల రెడ్డి దృష్టికి తమ సమస్యను తీసుకువెళ్లి పరిష్కరించాలని కోరారు కాలనీవాసులు.దీంతో సమస్యను పరిష్కరించాల్సిన కార్పొరేటర్ సంబంధిత అధికారులతో మాట్లాడి వర్షపు నీటిని క్లియర్ చేసే ప్రయత్నం చేయాల్సి ఉంది.

అయితే కాలనీ వాసుల ఇబ్బందిని గమనించిన కార్పొరేటర్ అధికారుల తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ, అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టింపులేనట్లు వ్యవహరిస్తున్నారని వినూత్నంగా నిరసన తెలియజేశారు. తిరుమల్ రెడ్డి మిడోస్ కాలనీ కి వెళ్ళే దారి పై ఉన్న వర్షపు నీటిలో పడుకొని తన నిరసన తెలియజేశారు. ఇక గతంలోనూ గుంతలకు వ్యతిరేకంగా నిరసన తెలియ చేసిన ఆయన ఒక కొబ్బరికాయను పగలగొట్టి, గుంతలో పువ్వులు వేసి వార్తల్లో నిలిచారు.
అంతేకాదు రోడ్లపై చెత్తను శుభ్రం చేస్తూ, నాలాలలో చెత్తను తొలగిస్తూ ఆయన తన నిరసనను గతంలోనూ పలుమార్లు తెలియజేశారు. అయితే కాలనీ వాసులు మాత్రం కార్పొరేటర్ గా సమస్య పరిష్కరించ మంటే వర్షపు నీటిలో పడుకుని నిరసన తెలియజేయటంతో అవాక్కయ్యారు. తమ సమస్య ఇంకెవరికి చెప్పుకోవాలో అర్ధం కాక తీవ్ర అసహనంతో ఉన్నారు.












Click it and Unblock the Notifications