దిశా నిందితుల ఎన్కౌంటర్ : దర్యాప్తు ముమ్మరం,హైదరాబాద్కు విచారణ కమిషన్
దిశా హత్యాచార నిందితుల ఎన్కౌంటర్పై విచారణకు సుప్రీం కోర్టు నియమించిన త్రిసభ్య విచారణ కమిషన్ సోమవారం హైదరాబాద్ చేరుకుంది. కమిషన్ సభ్యులైన మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి సిర్పూర్కర్, బాంబే హైకోర్టు రిటైర్డ్ జడ్జి రేఖా శర్మ,మాజీ సీబీఐ డైరెక్టర్ కార్తీకేయన్ తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో భేటీ అయి ఎన్కౌంటర్పై చర్చించారు. అయితే విచారణ కమిషన్ కోసం అవసరమైన కార్యాలయం,వసతుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఏమైనా ఏర్పాట్లు చేసిందా లేదా అన్నదానిపై స్పష్టత లేదు.అయితే హైకోర్టులోని సీ-బ్లాక్ వేదికగా కమిషన్ విచారణ సాగించనున్నట్టు సమాచారం. సుప్రీం ఆదేశాల మేరకు కమిషన్కు సీఆర్పీఎఫ్ బలగాలతో పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు.
కాగా,దిశ నిందితుల ఎన్కౌంటర్పై అనుమానాలను వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. ఇది ప్రభుత్వ డైరెక్షన్లో జరిగిన ఎన్కౌంటర్ అని పలు పిటిషన్లు ఆరోపించాయి. ఈ నేపథ్యంలో ఘటనపై విచారణకు సుప్రీం త్రిసభ్య కమిషన్ను నియమించింది. ఆరు నెలల్లోపు ఈ కమిషన్ కోర్టుకు నివేదిక సమర్పించాలని ఆదేశించింది. దీనిపై మరే కోర్టు విచారణకు ఆదేశించవద్దని కూడా స్పష్టం చేసింది. కమిషన్ ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని ఆదేశించింది.
ఇదిలా ఉంటే, విచారణలో భాగంగా సైబరాబాద్ కమిషనరేట్ ఉన్నతాధికారులు,ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులు,దర్యాప్తు అధికారులు,మృతదేహాలకు పంచనామా నిర్వహించిన రెవెన్యూ అధికారులు,పోస్టుమార్టమ్ నిర్వహించిన వైద్యులను కమిషన్ ప్రశ్నించనుంది. అలాగే ఎన్కౌంటర్కు గురైన దోషుల కుటుంబ సభ్యుల స్టేట్మెంట్స్ కూడా రికార్డు చేయనున్నారు. మరోవైపు ప్రతిపక్ష నేతలు.. కేసీఆర్ ప్రభుత్వం దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసులో విచారణ కమిషన్కు సహకరించడం లేదని ఆరోపిస్తుండటం గమనార్హం.