తెరపైకి మార్గదర్శి కేసు: రామోజీరావు సహా పలువురికి సుప్రీంకోర్టు నోటీసులు
హైదరాబాద్: మార్గదర్శి కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసులో రామోజీరావుకు, ఫైనాన్సియర్లకు సుప్రీంకోర్టు తాజాగా నోటీసులు జారీ చేసింది.
మార్గదర్శి పైనాన్షియర్స్ కేసును ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేయడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పిటీషన్ వేశారు.
ఉండవల్లి పిటిషన్ను విచారించిన జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని త్రిసభ్య
ధర్మాసనం రిజర్వు బ్యాంక్, మాజీ ఐజీ కృష్ణంరాజును కూడా ఈ కేసులో ఇంప్లీడ్ చేసేందుకు చేసుకున్న ఉండవల్లి దరఖాస్తులకు అనుమతి మంజూరు చేసింది.
కాగా, సోమవారం రామోజీరావుకు, మార్గదర్శికి ఫైనాన్షియర్స్కు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు, కృష్ణంరాజుకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులకు లిఖిత పూర్వక సమాధానాలు దాఖలు చేసిన తర్వాత తదుపరి విచారణ చేపట్టనుంది.

కాగా, రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) చట్టం నిబంధనలకు విరుద్ధంగా 2,600 కోట్ల రూపాయలను సుమారు రెండున్నర లక్షల మంది నుంచి రామోజీరావు డిపాజిట్ల రూపంలో సేకరించారని మాజీ ఐజీ కృష్ణంరాజు ఫిర్యాదు చేశారు. కాగా, ఉమ్మడి హిందూ కుటుంబం(హెచ్యూఎఫ్) ద్వారా డిపాజిట్లు సేకరించడం చట్టరీత్యా నేరం కాదని ఉమ్మడి హైకోర్టు ముందు రామోజీరావు వాదనలు వినిపించారు.
ఉమ్మడి హిందూ కుటుంబం ఒక వ్యవస్థ కాదు, ఒక కంపెనీ కాదు, సంస్థ కాదు, వ్యక్తుల సమూదాయం కూడా కాదు కాబట్టి.. ఆర్బీఐ చట్టం సెక్షన్ సెక్షన్ 45(ఎస్) నిబంధనలు వర్తించవని రామోజీరావు చేసిన వాదనలతో అంగీకరించి ఉమ్మడి హైకోర్టు విభజన రోజున ఈ కేసును కొట్టివేసింది. హైకోర్టు తీర్పును ఆలస్యంగా గ్రహించిన ఉండవల్లి, కోర్టును ఆశ్రయించడంలో 266 రోజులపాటు జరిగిన జాప్యాన్ని మన్నించాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే కోర్టు నోటీసులు జారీ చేసింది.












Click it and Unblock the Notifications