రేవంత్ సభలో సూరీడు.. వైఎస్ వ్యక్తిగత సహాయకుడు ప్రత్యక్షం.. అందరిదృష్టి అటువైపే
సూరీడు.. దివంగత వైఎస్ఆర్ వ్యక్తిగత సహాయకుడు. వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో ఓ మెరుపు మెరిశాడు. ఆ తర్వాత కనిపించకుండా పోయాడు. మళ్లీ ఇన్నాళ్లకు తళుక్కున మెరిశాడు. కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి సభలో కనిపించారు. దీంతో కెమెరాలు అన్నీ అటే క్లిక్ మనిపించాయి. రేవంత్ రెడ్డితో సూరీడు ఫోటో కూడా దిగారు. దీంతో సూరీడు రేవంత్తో కలిసి పనిచేస్తారా..? లేదంటే వైఎస్ఆర్ మాదిరిగా రేవంత్ వద్ద పనిచేస్తారా అనే చర్చ మొదలైంది.
రాజీవ్ రైతు రణభేరీ సభ
రేవంత్ రెడ్డి నేతృత్వంలో రావిరాలలో రాజీవ్ రైతు రణభేరి సభ జరిగింది. ఈ క్రమంలో సభకు ఊహించని వ్యక్తి హాజరయ్యారు. రాష్ట్ర రాజకీయాల్లో ప్రముఖంగా కనిపించిన వ్యక్తి, దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డికి వ్యక్తిగత సహాయకుడిగా పని చేసిన సూరీడు సభా వేదికపై తళుక్కున మెరిశారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డితో కలిసి ఫొటో దిగారు. ఆయన రాకతో సరికొత్త చర్చకు దారితీసింది. వైఎస్ మరణించినప్పటి నుంచి మీడియాకు దూరంగా ఉంటూ వస్తున్న సూరీడు.. ఇవాళ రేవంత్ సరసన కనపడటం చర్చనీయాంశమైంది.
నిప్పులు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అన్నదాతలకు న్యాయం చేయకుంటే వారి ఉసురు తగులుతుందని చెప్పారు. కేంద్ర/ రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరిపై దుమ్మెత్తిపోశారు.
హాజరైంది వీరే
రేవంత్ రెడ్డి సభకు కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, వర్కింగ్ ప్రెసిడెంట్లు పొన్నం ప్రభాకర్, కుసుమకుమార్, మాజీ ఎంపీలు సురేష్ షట్కర్, సిరిసిల్ల రాజయ్య, మల్లు రవి, పరిగి మాజీ ఎమ్మెల్యే రాంమోహన్ రెడ్డి, మాజీ మంత్రి చిన్నారెడ్డి, కొండా సురేఖ, సంబాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే సీతక్క, మాజీ ఎమ్మెల్యేలు గంగారాం, మల్రెడ్డి రంగారెడ్డి, కూన శ్రీశైలం గౌడ్, విజయ రమణా రావు, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్, అనిల్ కుమార్ యాదవ్ హాజరయ్యారు.