టీడిపి ఎమ్మెల్యే ప్రగతి భవన్ లో ప్రత్యక్షం..! ఉలిక్కి పడ్డ కాంగ్రెస్ పార్టీ..!!
హైదరాబాద్ : ఆయన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే..! తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థి. తెలుగుదేశం పార్టీకి అత్యంత విశ్వాస పాత్రుడు. ఐతే తెలంగాణలో మారిన రాజకీయ సమీకరణాల ప్రకారం ఆ ఎమ్మెల్యే పార్టీ మారేందుకు సన్నాహలు చేసుకుంటున్నట్టు గెలిచిన మరుక్షణం నుండి వార్తలు ఘుప్పు మంటున్నాయి. ఆ ఎమ్మెల్యే కూడా పార్టీ మారేందుకు సుముఖంగా ఉన్నట్టు సంకేతాలు కూడా ఇస్తున్నారు. కానీ అంతర్గతంగా ఏమౌతుందో తెలియట్లేదు కాని సదరు టీడిపి ఎమ్మెల్యే ఇంతవరకూ పార్టీ మాత్రం మారలేదు. ఇదే సమయంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు రావడంతో ఆ ఎమ్మెల్యే కదలికలపై సొంత పార్టీ టీడిపి కన్నా కాంగ్రెస్ పార్టీ ఓ కన్నేసి పెట్టింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్తి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలంటే తెలుగుదేశం పార్టీ కి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల మద్దత్తు కాంగ్రెస్ పార్టీకి ఎంతో అవసరం. అందుకే టీడిపి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ప్రగతి భవన్ లో ప్రత్యక్షం అయ్యాడని తెలియగానే కాంగ్రెస్ పార్టీ ఉలిక్కి పడినట్టు తెలుస్తోంది.
తమ పార్టీ ఎమ్మెల్సీని అభ్యర్థిని గెలిపించుకోవాలంటె కాంగ్రెస్ కు 21 ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ప్రస్తుతం కాంగ్రెస్ 19 మంది ఎమ్మెల్యేలు ఉండగా, టీడీపీ కి మరో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే గడిచిన క్షణం వరకూ తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు తమకే ఓటు వేస్తారని కాంగ్రెస్ పార్టీ బలంగా నమ్ముతూ వస్తోంది. నమ్మడమే కాకుండా ఆ పార్టీ అభ్యర్థి సునాయాసంగా గెలిచి తీరుతాడని అదిష్టానానికి హామీ కూడా ఇచ్చింది. ఐతే టీడిపి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కాంగ్రెస్ ఆశలపై నీళ్లు చల్లేట్టు కనిపిస్తున్నాడు. అత్యంత కీలక సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుతో సమావేశమై తన ఉద్దేశం ఏంటో చెప్పకనే చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సండ్రను నిలువరించేందుకు ఎలాంటి వ్యూహం అమలు చేస్తుందో చూడాలి.