తెలంగాణపై టీడీపీ కన్నేసిందా.. కేసీఆర్కు చెక్ పెట్టేందుకు చంద్రబాబు రెడీయా?
హైదరాబాద్ : తెలంగాణ రాజకీయాలపై టీడీపీ కన్నేసిందా? టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజా వ్యతిరేకత వస్తోందని పచ్చ దండు భావిస్తోందా? తెలంగాణలో పార్టీకి పునర్ వైభవం తీసుకొచ్చేలా ప్రయత్నాలు ప్రారంభించిందా? ఇలాంటి సవాలక్ష ప్రశ్నలకు తాజా పరిణామాలు అవుననే సమాధానం ఇస్తున్నాయి. తాజాగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు వీటికి ఊతమిస్తున్నాయి. హుజుర్నగర్ పోటీకి సై అంటూ సంకేతాలు ఇవ్వడంతో తెలంగాణపై పట్టు సాధించేలా టీడీపీ ప్రయత్నాలు మొదలు పెట్టిందనే వాదనలు లేకపోలేదు.
తెలుగు రాజకీయాల్లో టీడీపీది ప్రత్యేక స్థానం
తెలుగుదేశం పార్టీ ప్రస్థానం తెలుగు రాజకీయాలను మలుపు తిప్పింది. కాంగ్రెస్ పార్టీ తప్ప మరో పార్టీ ఉనికి లేని అప్పటి తరుణంలో అన్న ఎన్టీఆర్ నేతృత్వంలో పురుడు పోసుకున్న టీడీపీ అంచెలంచెలుగా ఎదిగింది. అప్పటివరకు కాంగ్రెస్ పార్టీకి జై కొట్టిన జనం క్రమక్రమంగా టీడీపీ వైపు ఆకర్షితులయ్యారు. 1982లో ఆత్మగౌరవ నినాదంతో ప్రజల్లోకి వెళ్లిన ఎన్టీఆర్కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అప్పట్లో ఎన్టీఆర్ చైతన్య రథం వస్తుందంటే గ్రామాల్లో సందడి అంతా ఇంతా కాదు. అలా కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా టీడీపీని బలోపేతం చేసిన ఎన్టీఆర్ బీసీలకు, యువతకు పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు. పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల కాలంలోనే పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన తొలి ప్రాంతీయ పార్టీ టీడీపీయే కావడం విశేషం.
హుజుర్నగర్ ఉప ఎన్నిక రసవత్తరం.. రేసులో టీడీపీ సైతం.. తీన్మార్ మల్లన్న వ్యూహామేంటో..?
దేశ రాజకీయ చరిత్రలో టీడీపీ ప్రస్థానం ప్రత్యేకం
తెలుగు రాష్ట్రం నుంచి ప్రారంభమైన టీడీపీ ప్రస్థానం దేశ రాజకీయ చరిత్రలో ఎంతో ప్రత్యేకమని చెప్పొచ్చు. ఏ ప్రాంతీయ పార్టీకీ లేని ఎన్నో ప్రత్యేకతలు తెలుగుదేశం పార్టీ సొంతం. ఎన్టీఆర్ మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అయితే తదనంతర పరిణామాలతో 1995లో చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ను గద్దె దించి సీఎం కుర్చీ సొంతం చేసుకున్నారు. ఆయన హయాంలో కూడా ఉమ్మడి ఏపీలో టీడీపీ బలంగా ఉండేది. అయితే 2014లో రాష్ట్ర విభజన జరిగి తెలంగాణ ఏర్పడ్డాక ఇక్కడి ప్రాంతంలో టీడీపీ ఉనికి లేకుండా పోయింది.
టీఆర్ఎస్ ధాటికి టీడీపీ ఔట్
ఉద్యమం నుంచి మొదలైన టీఆర్ఎస్ పార్టీ రాజకీయ శక్తిగా అవతరించడంతో టీడీపీ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. టీడీపీ క్యాడర్ క్రమక్రమంగా ఇతర పార్టీల వైపు మళ్లడంతో ఆ పార్టీ దాదాపుగా ఖాళీ అయిపోయింది. చంద్రబాబు నాయుడు కూడా ఏపీ పైనే ప్రధానంగా దృష్టి పెట్టారు తప్ప తెలంగాణ టీడీపీని పెద్దగా పట్టించుకోలేదనే వాదనలున్నాయి. అయితే ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని దెబ్బ తీసేందుకు మహాకూటమిగా కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపినా ఆశించిన ప్రయోజనం దక్కలేదు.
దసరా పండుగ వేళ.. స్పెషల్ బస్సులు, ప్రత్యేక రైళ్లు
ఏపీలో ఐదేళ్లు పని లేనట్లేగా.. అందుకే తెలంగాణలో చక్రం..!
ఏపీ అసెంబ్లీ ఎన్నికలు కూడా టీడీపీకి కలిసి రాకపోవడంతో అక్కడ కూడా అధికారం కోల్పోవాల్సి వచ్చింది. అయితే ఈ ఐదేళ్లు అక్కడ పెద్దగా పని ఉండదని భావించిన చంద్రబాబు నాయుడు తిరిగి తెలంగాణ టీడీపీని బలోపేతం చేసే దిశగా ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. జగన్ ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు చురకలు అంటించడానికి సీనియర్ నేతలను పురమాయించి.. తాను మాత్రం తెలంగాణ టీడీపీ బలోపేతానికి పనిచేయనున్నారనే టాక్ వినిపిస్తోంది.
టీఆర్ఎస్పై ప్రజా వ్యతిరేకత కనిపిస్తోందనే భావన
టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత కనిపిస్తోందని భావిస్తున్న టీడీపీ పెద్దలు పార్టీని బలోపేతం చేయడానికి సన్నద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీ నేతలు తెలంగాణలో జోష్ పెంచుతూ టీఆర్ఎస్కు చెక్ పెట్టేందుకు సిద్ధమయ్యారు. అయితే టీఆర్ఎస్ను దీటుగా ఎదుర్కోవడానికి కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీ ప్లే చేస్తున్న పరిస్థితి కనిపించడం లేదు. అందుకే ఈ పరిణామాలను ఎన్క్యాష్ చేసుకోవాలనేది చంద్రబాబు అంతరంగంగా కనిపిస్తోంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి చంద్రబాబు చక్రం..!
తెలంగాణలో ఇప్పటికీ టీడీపీకి క్యాడర్ ఉందని బలంగా నమ్ముతున్న చంద్రబాబు ఆ మేరకు రాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ చక్రం తిప్పేందుకు రెడీ అవుతున్నారనే ప్రచారానికి హుజుర్నగర్లో టీడీపీ అభ్యర్థిని నిలబెడుతుండటమే సాక్ష్యమంటున్నారు కొందరు. మొత్తానికి సీఎం కేసీఆర్ వ్యూహాలకు చంద్రబాబు పునరాలోచన ఏ విధంగా చెక్ పెడుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో తెలుగుదేశానికి పునర్ వైభవం తీసుకు రావాలంటే హుజుర్నగర్లో పోటీ చేయాలని డిసైడ్ అయినట్లు చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించడం ఈ పరిణామాలకు ఊతమిస్తోంది.