మరికొన్ని గంటల్లో క్యాబినెట్ భేటీ.. పీఆర్సీ గురించి కీలక నిర్ణయం, లాక్ డౌన్ కూడా
తెలంగాణ రాష్ట్రంలో లాక్డౌన్ 9వ తేదీ ముగియనున్న సంగతి తెలిసిందే. ఇతర అంశాలు కూడా ఉన్నందున మంగళవారం మంత్రివర్గం సమావేశం అవుతుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్లో క్యాబినెట్ భేటీ జరుగుతుంది. ఉద్యోగుల పీఆర్సీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

అధికారిక ప్రకటన..
పీఆర్సీకి సంబంధించి మంగళవారం అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. సమావేశంలో పీఆర్సీ అంశంపై చర్చ జరుగనుంది. ఇప్పటికే వేతన సవరణ పూర్తి నివేదికను ఆర్థిక శాఖ సమర్పించింది. దీంతో ఉద్యోగుల వేతన సవరణ నివేదికను కేబినెట్ ఆమోదించనుంది. ఉద్యోగుల ఫిట్ మెంట్, ఇతర అంశాలపై సర్కార్ ఉత్తర్వులు విడుదల చేయనుంది.

30 శాతం ఫిట్మెంట్
కరోనా కష్టకాలంలో 30 శాతం ఫిట్ మెంట్ ప్రకటించి..సీఎం కేసీఆర్ ఉద్యోగుల కుటుంబాల్లో ఆనందం నింపారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారులతో 2018 మే 18న ప్రభుత్వం పీఆర్సీ కమిషన్ వేసిన సంగతి తెలిసిందే. 31 నెలలపాటు అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో కమిటీ చర్చించింది. తర్వాత 278 పేజీల నివేదికను 2020 డిసెంబర్ 31న ప్రభుత్వానికి కమిషన్ అందజేసింది. ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు సీఎం కేసీఆర్ ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశమైన విషయం తెలిసిందే. ఉద్యోగుల వయోపరిమితి పెంపు అంశంపై సీఎం హామీ ఇచ్చినట్లు ఉద్యోగ సంఘాలు వెల్లడించాయి.

రైతుబంధు, లాక్ డౌన్
రాష్ట్రంలో వైద్యం, కరోనా పరిస్థితులు, ఇరిగేషన్, రైతుబంధు, వ్యవసాయ పనులు, లాక్డౌన్ గురించి చర్చిస్తారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కూడా కేబినెట్ చర్చించే అవకాశముంది. రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి.. ప్రాజెక్టుల పనుల పురోగతి, చేపట్టవలసిన చర్యలు, వానాకాలం సాగునీరు, తదితర అంశాల మీద సమీక్ష జరగనుంది. వానాకాలం పంటల సాగు పనులు ప్రారంభమైన నేపథ్యంలో.. పంట పెట్టుబడి సాయం రైతుబంధు అందుతున్న విషయంపై, కల్తీ విత్తనాలు అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలు, ఎరువులు, క్రిమిసంహారక మందుల లభ్యత, తదితర వ్యవసాయ సంబంధిత అంశాలపై కూడా కేబినెట్ చర్చించే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications