ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన కేసీఆర్, బోనం ఎత్తిన కవిత
హైదరాబాద్: నగరంలో లష్కర్ బోనాలు వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారిని దర్శించుకునేందుకు ఉదయం నుంచే భక్తులు బారులు తీరారు. ఆదివారం ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు. సతీమణి శోభతో కలిసి అమ్మవారిని దర్శించుకున్న కేసీఆర్.. ప్రత్యేక పూజలు చేశారు. కేసీఆర్ వెంట పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు.
అనంతరం మహంకాళి అమ్మవారికి ముఖ్యమంత్రి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు. ఆ తర్వాత డిప్యూటీ స్పీకర్ పద్మారావు నివాసంలోని ముత్యాలమ్మ గుడిలో సీఎం దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఆదివారం ఉదయం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తొలి బోనంతో ప్రారంభమైన ఉత్సవాలు సోమవారం కూడా కొనసాగనున్నాయి.

ఆదివారం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి బోనం సమర్పించారు. మరోవైపు, కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, హర్యానా గవర్నర్ దత్తాత్రేయ, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, సీఎస్ శాంతికుమార్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
భారీగా భక్తులు, వీఐపీల రాకతో ఆలయం, సరిసరాలు కిక్కిరిపోయాయి.

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు ఆదివారం హాజరై అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. మంత్రి కుటుంబ సభ్యులు అమ్మవారికి బోనం సమర్పించి, పూజలు నిర్వహించారు.

కాగా, తెలంగాణలో ఆషాఢ మాసమంతా బోనాల జాతర ఉంటుంది. తొలిఏకాదశి ముగిలిన తర్వాత బోనాల జాతర మొదలవుతుంది. ఈ నెలంతా హైదరాబాద్ నగరమంతా బోనాలు సందడి ఉంటుంది. వర్షాకాలంలో చేసుకునే ఈ పండుగకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ కాలంలో జ్వరాలు, అంటు వ్యాధులు వ్యాపిస్తాయి. అలా జరగకుండా ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటూ అమ్మవారికి బోనం సమర్పిస్తే అంతా మంచి జరుగుతుందని ప్రజల నమ్మకం. పండగ రోజున అమ్మవారికి నిష్టగా బోనం అలంకరించి అందులో నైవేద్యం వండి డప్పుచప్పుల్లతో అమ్మవారికి బోనం సమర్పిస్తారు. వందల ఏళ్లుగా ఈ ఉత్సవాలు నగరంతోపాటు తెలంగాణలో కొనసాగుతున్నాయి.












Click it and Unblock the Notifications