అగ్రవర్ణాలకు గుడ్ న్యూస్ చెప్పనున్న సీఎం కేసీఆర్...? 2-3 రోజుల్లో ప్రకటన వచ్చే ఛాన్స్...?
విద్యా,ఉద్యోగ రంగాల్లో అగ్ర వర్ణ పేదలకు 10శాతం రిజర్వేషన్ కల్పిస్తూ 2019లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని ఇకపై రాష్ట్రంలో కూడా అమలుచేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారు. ఈ చట్టం ప్రకారం అగ్రవర్ణాల్లో ఆర్థిక వెనుకబడినవారికి 10శాతం రిజర్వేషన్ కల్పించనున్నారు. దీనిపై మరో రెండు,మూడు రోజుల్లో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించి తుది నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.

60శాతానికి చేరనున్న రిజర్వేషన్లు
ప్రస్తుతం ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనారిటీలకు కొనసాగుతున్న రిజర్వేషన్లను యథాతథంగా కొనసాగిస్తూనే ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణ పేదలకు 10శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీంతో మొత్తం రిజర్వేషన్లు 60శాతానికి చేరనున్నాయి. అగ్రవర్ణ పేదలకు ఇచ్చే రిజర్వేషన్లో ఓసీ వారికి మాత్రమే అవకాశం ఉంటుంది. వార్షిక ఆదాయం రూ.8లక్షల లోపు కలిగిన అగ్ర వర్ణాల అభ్యర్థులకు ఈ రిజర్వేషన్ వర్తిస్తుంది.

ఇప్పటివరకూ ఐదు మెడికల్ కాలేజీల్లో మాత్రమే...
ఇప్పటివరకూ రాష్ట్రంలో కేవలం ఐదు మెడికల్ కాలేజీల్లో మాత్రమే అగ్రవర్ణాలకు 10శాతం రిజర్వేషన్ను ప్రభుత్వం అమలుచేసింది. మెడికల్ సీట్లు ఎక్కువగా ఉండే గాంధీ,ఉస్మానియా ఆస్పత్రుల్లో ఇప్పటివరకూ ఆ కోటా అమలుచేయలేదు. దీంతో 10శాతం ఈడబ్ల్యూఎస్ కోటాను అమలుచేయాలని అగ్రవర్ణాల పేదలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ దిశగా ఫోకస్ చేశారు. ఈ నిర్ణయం అమలులోకి వస్తే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని విద్య,ఉద్యోగ రంగాల్లో అగ్రవర్ణ పేదలకు 10శాతం రిజర్వేషన్ దక్కుతుంది.
Recommended Video

అగ్రవర్ణాలకు 5వేల ఉద్యోగాలు...!!
త్వరలోనే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 50వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని ఇటీవల ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయా శాఖల్లోని ఖాళీల వివరాలు ప్రభుత్వానికి చేరాయి. ఈ నోటిఫికేషన్లకు ప్రభుత్వం అగ్రవర్ణాలకు 10శాతం రిజర్వేషన్ అమలుచేస్తే... ఆ కోటా కింద 5వే ఉద్యోగాలు భర్తీ అవుతాయి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంజనీరింగ్,ఎంబీబీఎస్ సహా ఇతర కోర్సుల్లో ప్రవేశాలకు కూడా ఈ రిజర్వేషన్ అమలుచేసే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications