నేడే హాలియా బహిరంగ సభ... చాలా రోజులకు జనం ముందుకు కేసీఆర్... సాగర్ వార్ షురూ?
టీఆర్ఎస్ ఏడేళ్ల పాలనలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో సాధించిన అభివృద్దిని ప్రజలకు నివేదించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం(ఫిబ్రవరి 10) హాలియాలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. నాగార్జున సాగర్ ఉపఎన్నికతో ఈ బహిరంగ సభకు సంబంధం లేదని చెప్తున్నప్పటికీ... వరుస పరాభావాల నేపథ్యంలో టీఆర్ఎస్ ఈసారి ఒకింత ముందుగానే అప్రమత్తమైందన్న చర్చ కూడా జరుగుతోంది. చాలా రోజుల తర్వాత కేసీఆర్ ప్రజల ముందుకు రాబోతున్న సభ కూడా ఇదే కావడం గమనార్హం. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంలో ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన భారీ బహిరంగ సభ తర్వాత కేసీఆర్ మళ్లీ జనం ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై,పార్టీకి ఎదురవుతున్న పలు విమర్శలపై కూడా ఆయన తనదైన శైలిలో స్పందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి
హాలియా బహిరంగ సభ నిర్ణయాన్ని సీఎం కేసీఆర్ వారం రోజుల క్రితమే నిర్ణయించారు. తక్కువ వ్యవధే అయినప్పటికీ సభకు భారీగా జనాన్ని సమీకరించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. హాలియాలోని స్థానిక అలీనగర్ సమీపంలో నల్గొండ రహదారి పక్కనే ఇప్పటికే సభా ప్రాంగణాన్ని సిద్దం చేశారు. నాగార్జునసాగర్ ఉపఎన్నిక నేపథ్యంలో సభను విజయవంతం చేయడానికి ఉమ్మడి నల్గొండ జిల్లా సర్వశక్తులు ఒడ్డుతున్నారు. మంత్రి జగదీశ్రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి తక్క ల్లపల్లి రవీందర్రావు, మాజీ విప్ కర్నె ప్రభాకర్ తదితరులు బహిరంగ సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం 2గంటల తర్వాత సభ జరగనుంది.

ఉపఎన్నికతో సంబంధం లేదని చెప్తున్నప్పటికీ...
నాగార్జున సాగర్ ఉపఎన్నికతో సభకు సంబంధం లేదని... జిల్లాలో టీఆర్ఎస్ చేసిన అభివృద్దిని ప్రజలకు నివేదించేందుకు బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నామని టీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. అయితే గత దుబ్బాక,జీహెచ్ఎంసీ అనుభవాల దృష్ట్యా.. నాగార్జునసాగర్ ఉపఎన్నిక కోసం కేసీఆర్ ఈసారి కాస్త ముందు నుంచే అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారన్న చర్చ కూడా జరుగుతోంది. దుబ్బాక ఉపఎన్నిక సందర్భంగా కేసీఆర్ అసలు ప్రచారంలోనే పాల్గొనలేదు. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంలోనూ కేవలం క్లైమాక్స్లో ఒకే ఒక్క సభలో పాల్గొని ప్రసంగించారు. ఆ పరాభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి సాగర్ ఉపఎన్నిక కోసం ముందుగానే రంగంలోకి దిగుతున్నారన్న వాదన వినిపిస్తోంది.

చాలారోజులకు జనం ముందుకు కేసీఆర్
చాలారోజుల తర్వాత కేసీఆర్ జనం ముందుకు వస్తుండటంతో చాలా అంశాలపై ఆయన మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా రైతులు,రాష్ట్రంలో బీజేపీ వైఖరి,ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులు తదితర అంశాలపై ఆయన మాట్లాడనున్నట్లు తెలుస్తోంది. ఈ సభతో సాగర్ ఉపఎన్నికకు ముందు టీఆర్ఎస్ వర్గాల్లో ఒక జోష్ నింపాలని... ప్రత్యర్థులకు గట్టి సవాల్ విసరాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఇక సాగర్ ఉపఎన్నికలో పోటీ చేసే టీఆర్ఎస్ అభ్యర్థిపై ఇప్పుడప్పుడే కేసీఆర్ స్పష్టతనిచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. దీనికి మరికొంత సమయం పట్టవచ్చునని అంటున్నారు.












Click it and Unblock the Notifications