కేసీఆర్ సీక్రెట్ ఆపరేషన్.. సచివాలయం కింద నిజాం ఖజనా.. తేదీలతో రేవంత్ రెడ్డి సంచలనం..
దాదాపు 11 రోజుల తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ చేరుకుని, పలు శాఖలపై రివ్యూలు నిర్వహించడంతో #whereiskcr #kcrmissing లాంటి అనూహ్య ప్రచారాల ఉధృతి తగ్గింది. ఆ సమయంలో సీఎం కరోనాకు చికిత్స తీసుకున్నారన్నది వట్టి పుకార్లుగానే మిగిలిపోయాయి. కానీ ఆయన ఫామ్ హౌజ్ కు వెళ్లిన, మళ్లీ తిరిగొచ్చిన తేదీలను బట్టి, ఆయా రోజుల్లో చోటుచేసుకున్న సంఘటనలను బట్టి ఏదో పెద్ద మతలబే ఉందని అంటున్నారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. సచివాలయం కూల్చివేత అంశంలో సంచలన కోణాన్ని బయటపెట్టారు.

సచివాలయం కింద ఖజానా?
హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ పక్కనుండే సచివాలయ భవనానికి సుదీర్ఘ చరిత్ర ఉన్న సంగతి తెలిసిందే. అక్కడి జీ బ్లాక్ భవంతిని 132 ఏళ్ల కిందట.. ఆరో నిజాం నిర్మించడం తెలిసిందే. గత వారం కూల్చివేత పనులు ప్రారంభమైనప్పటి నుంచి.. సచివాలయం కింద నిజాం ఖజానా ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఈ విషయాలపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి స్పందించారు. అక్కడ ఖజానా ఉందనడానికి ఆధారాలను చూపెట్టిన ఆయన.. గుప్త నిధుల కోసమే కేసీఆర్ సీక్రెట్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారని ఆరోపించారు.

ఇవిగో ఆధారాలు..
‘‘సచివాలయం చుట్టూ 3 కిలోమీటర్ల మేర రాకపోకలు నిషేధించిమరీ కూల్చివేత పనులు చేస్తున్నారు. మా పరిశీలనలో తేలిందేంటంటే.. గుప్త నిధుల కోసమే దీన్ని కూల్చేస్తున్నారు. సచివాలయంలోని జీ బ్లాక్ కింద నిజాం ఖజానా ఉందని, నేల మాళిగల్లో నిజాం నిధులను దాచుకున్నాడని ఇదివరకే బోలెడు నివేదికలు ఉన్నాయి. సొరంగాల కేంద్రం జీ బ్లాక్ కింద ఉందని పురావస్తు శాఖ గతంలోనే గుర్తించింది. వాటి అన్వేషణ కోసం పర్మిషన్ ఇవ్వాలంటూ పురావస్తు శాఖ లేఖ రాసినా జీహెచ్ఎంసీ అంగీకరించలేదు. అంతేకాదు, ఆ లేఖ రాసిన అధికారిని పదవి నుంచి తొలగించారు కూడా. సచివాలయం కింద గుప్త నిధులపై అన్ని ప్రధాన పత్రికల్లో వార్తలు వచ్చాయి. ఆఖరికి కేసీఆర్ సొంత పత్రికలోనూ దీనిపై వరుస కథనాలు ప్రచురించారు'' అని రేవంత్ రెడ్డి వివరించారు.

పోఖ్రాన్ కంటే రహస్యంగా..
132 ఏళ్ల నాటి సచివాలయం భవంతి కూల్చివేత పనులు పురావస్తు శాఖ పర్యవేక్షణలో జరగాల్సి ఉండగా, కేసీఆర్ సర్కార్ ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదని, పోఖ్రాన్ అణు పరీక్షల కంటే రహస్యంగా కూల్చివేతను కొనసాగిస్తున్నారని, నిబంధనలు అతిక్రమించిన కారణంగానే హైకోర్టు స్టే ఆర్డర్ ఇచ్చిందని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. నిజాం ఖజానా వ్యవహారంపై తాము హైకోర్టును ఆశ్రయిస్తామని, ఇది లక్షల కోట్ల విలువైన సంపదకు సంబంధించిన అంశం కాబట్టి వెంటనే విచారించాల్సిందిగా కోరతామని ఆయన స్పష్టం చేశారు.

ఆ తేదీల్లోనే కేసీఆర్ అలా..
సెక్రటేరియట్ కూల్చివేతకు, కేసీఆర్ అదృశ్యానికి మధ్య ఏదో తెలియని లింక్ ఉందని కాంగ్రెస్ ఎంపీ అనుమానం వ్యక్తం చేశారు. సచివాలయం కూల్చివేతకు హైకోర్టు.. జూన్ 29న గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. అదే రోజు నుంచి కేసీఆర్ కనిపించకుండా పోయారని, మళ్లీ, జూలై 10న సచివాలయం కూల్చివేతపై హైకోర్టు స్టే ఇచ్చిన రోజే కేసీఆర్ తిరిగి ప్రగతి భవన్ వచ్చారని, ఆ 11 రోజుల్లో సీఎం ఏం చేశారు, ఎక్కడున్నారనే రహస్యాలు బయటికి రావాల్సి ఉందని రేవంత్ అన్నారు.
Recommended Video

కూల్చివేత కుట్ర.. కట్టడం అసాధ్యం..
ఇప్పుడన్న సెక్రటేరియట్ భవనాన్ని కూల్చివేయడంతో ప్రభుత్వం కుట్రపూరితంగా, రహస్యంగా వ్యవహరిస్తున్నదని, నిజాం రహస్య నిధుల కోసమే కేసీఆర్ ఈ పని చేస్తున్నాడని ఆరోపించిన కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి.. తిరిగి ఆ ప్రాంతంలో సచివాలయ నిర్మాణం అసాధ్యమని అన్నారు. హుస్సేన్ సాగర్ క్యాచ్ మెంట్ పరిధిలోకి వచ్చే ఆ ప్రాంతంలో కాంక్రీట్ నిర్మాణాలకు అనుమతులు రాబోవని, ప్రసాద్ ఐమాక్స్ సహా అక్కడి నిర్మాణాలన్నీ తాత్కాలికమైనవేనని, ఈ విషయం తెలిసి కూడా భూముల్ని సంస్థలకు కట్టబెట్టే ఉద్దేశంతోనే కేసీఆర్ సర్కారు కూల్చివేతలకు సిద్ధమైందని రేవంత్ రెడ్డి ఆరోపించారు.












Click it and Unblock the Notifications