పార్కింగ్ ఫీ వసూల్: సినిమా థియేటర్లకు గుడ్న్యూస్, మల్టీప్లెక్స్కు నో రిలీఫ్
హైదరాబాద్: కరోనా వైరస్ మహమ్మారి కారణంగా సుమారు ఏడాదికిపైగా మూతబడిన సినిమా థియేటర్లకు తెలంగాణ ప్రభుత్వం ఊరట కల్పించింది. నష్టాల ఊబిలో కూరుకుపోయిన థియేటర్ల యాజమాన్యాలకు ఆర్థిక వెసులుబాటు కలిగేలా పార్కింగ్ ఫీజులు వసూలు చేసుకునేందుకు అనుమతి ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇక నుంచి రాష్ట్రంలోని అన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్ల వద్ద యాజమాన్యం సినిమాకు వచ్చే ప్రేక్షకుల నుంచి వాహనాల పార్కింగ్ ఫీజు వసూలు చేసుకోవచ్చని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. అయితే, ఈ ఉత్తర్వులు కేవలం సింగిల్ స్క్రీన్ థియేటర్లకు మాత్రమే వర్తిస్తాయని, మల్టీప్లెక్స్, వ్యాపార వాణిజ్య సముదాయాల్లో ప్రజల నుంచి పార్కింగ్ ఫీజులు వసూలు చేయవద్దని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇందుకు సంబంధించి గతంలో జారీ చేసిన ఉత్తర్వులే అమల్లో ఉంటాయని వెల్లడించింది.
కాగా, 2018లో పార్కింగ్ ఫీజులను రద్దు చేస్తూ జారీ చేసిన జీవో నెం. 63ను సవరిస్తూ తాజా ఉత్తర్వులు జారీ చేసింది. చాలా మంది సినిమా థియేటర్ల వద్ద వాహనాలు పార్కింగ్ చేసి వెళ్లడం, పర్యవేక్షణ లేకపోవడంతో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందన్న యాజమాన్యాల విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం.. థియేటర్ల వద్ద నిలిపివుంచే వాహనాలకు నిర్ణీత రుసుము వసూలు చేసి వాటిని పర్యవేక్షించాల్సిందిగా నిర్వాహకులను ఆదేశించింది.
Recommended Video
ఇది ఇలావుండగా, తెలంగాణలో కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో సినిమా థియేటర్లను తిరిగి ఓపెన్ చేసేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. 100 శాతం ఆక్యుపెన్సీతో సినిమా థియేటర్లు జులై 23 నుంచి తెరుచుకోనున్నాయి. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హామీతో థియేటర్లను ఓపెన్ చేస్తున్నట్లు తెలంగాణ సినిమా థియేటర్ల అసోయేషన్ ఇటీవల ప్రకటించింది.