'తెలుగు'కు పట్టం.. కేసీఆర్ ఆమోదమే తరువాయి
హైదరాబాద్ : తెలంగాణలో తెలుగు భాషకు పట్టం కట్టనుంది సర్కార్. తెలుగు భాష వెలుగులు విరజిమ్మేలా సీఎం కేసీఆర్ ఇదివరకే అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆ మేరకు ప్రభుత్వ పరిపాలనా నిబంధనావళి, సచివాలయ నిబంధనలను తెలుగులోకి అనువదించారు. కేసీఆర్ ఆమోదించడమే తరువాయి ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి తెలుగు ప్రతులు. ఆయా శాఖల వెబ్సైట్లలో కూడా వీటిని పొందుపరచనున్నారు.
తెలుగుకు వెలుగు
తెలంగాణలో తెలుగు పకడ్బందీగా అమలు చేయాలని సీఎం కేసీఆర్ మొదటి నుంచి సీరియస్ గా ఉన్నారు. చట్టాలు, ఆర్డినెన్స్, నిబంధనావళి, మాన్యువల్స్ తదితర పత్రాలు ప్రజలందరికీ సులువుగా అర్థమయ్యే రీతిలో తెలుగులో అందిస్తే బాగుంటుందనేది ఆయన అభిప్రాయం. ఆ మేరకు గతేడాది జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో మొగ్గలు తొడిగిన ఆలోచనలకు కార్యరూపం ఇచ్చారు అధికారులు. రాష్ట్రంలో అమలవుతున్న చట్టాలు, నిబంధనలు లాంటివి తెలుగులో అనువదించాలని కేసీఆర్ ఆదేశించారు. దాంతో కవి, గాయకుడు దేశపతి శ్రీనివాస్.. గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ అయాచితం శ్రీధర్ ఆధ్వర్యంలో ఓ బృందం ఏర్పాటయింది.
తొలి అడుగు
ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమైన పత్రాలు తెలుగులోకి అనువదించాలనే కేసీఆర్ ఆదేశాలతో.. దేశపతి శ్రీనివాస్, అయాచితం శ్రీధర్ ఆధ్వర్యంలోని బృందం సంవత్సర కాలంగా పనిచేస్తోంది. అందులోభాగంగా తొలుత ప్రభుత్వ పరిపాలనా నిబంధనావళి, సచివాలయ నిబంధనలను తెలుగులోకి అనువదించారు. సీఎం పరిశీలన కోసం ఆ ప్రతులను ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపించారు. కేసీఆర్ ఆమోదం తెలపడమే తరువాయి అవి అందుబాటులోకి రానున్నాయి. అంతేకాదు ఆయా శాఖల వెబ్సైట్లలోనూ పొందుపరిచేలా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.
నెక్ట్స్ అదే..!
ప్రభుత్వ పరిపాలనా నిబంధనావళి, సచివాలయ నిబంధనలు తెలుగులోకి అనువదించిన ఈ బృందం.. మరో శాఖపై దృష్టి సారించింది. తెలంగాణ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన కొత్త పంచాయతీ రాజ్ చట్టాన్ని అనువదించే ప్రక్రియ స్పీడప్ చేసినట్లు సమాచారం. పంచాయతీలకు ఎన్నికలు జరిగి కొత్త సర్పంచులు, వార్డుమెంబర్లు కొలువుదీరడంతో.. వీలైనంత త్వరగా పంచాయతీ రాజ్ చట్టం తెలుగు ప్రతులను ప్రజలకు అందించాలనేది ప్రభుత్వం ఉద్దేశంగా కనిపిస్తోంది. దాంతో పంచాయతీల నిర్వహణపై వారికి అవగాహన పెరిగి గ్రామాల అభివృద్ధికి తోడ్పాటు అందిస్తారనే ఆలోచనతో ఉంది. మొత్తానికి ప్రభుత్వ సంబంధింత చట్టాలను తెలుగులోకి అనువదించే ప్రక్రియను వేగవంతం చేసి.. తెలంగాణలో తెలుగు భాష వెలుగులు విరజిమ్మేలా ముందుకెళుతున్నారు కేసీఆర్.