ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రిట్ పిటిషన్ దాఖలు చేయనున్న తెలంగాణ సర్కార్
ఎమ్మెల్యేల కొనుగోలు కేసును హైకోర్టు సీబీఐకి అప్పగించిన విషయం తెలిసిందే.. అయితే హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం గురువారం డివిజన్ బెంచ్ లో రిట్ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలిస్తోంది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టివేయాలంటూ హైకోర్టు డివిజన్ బెంచ్ లో రాష్ట్ర సర్కారు పిటిషన్ వేయనుంది. ఈ కేసుపై సీబీఐ విచారణ జరగకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరనుంది.
లీక్
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తు కోసం తెలంగాణ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఈ సిట్ విచారణ చేస్తుండగానే.. బీజేపీ ఈ కేసును సీబీఐకి అప్పగించాలని హైకోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ఆడియోలు, వీడియోలు బయటకు ఎలా లీక్ అయ్యాయో చెప్పాలని ప్రశ్నించింది. ఆ తర్వాత ఈ కేసును సీబీఐకి అప్పగించాలని తీర్పు చెప్పింది.
జడ్జిమెంట్ కాపీ
కేసుకు సంబంధించి 45 అంశాలను బేస్ చేసుకుని సీబీఐకి కేసు అప్పగించినట్టు జడ్జిమెంట్లో పేర్కొంది. కాగా, ఈ కేసు జడ్జిమెంట్ కాపీ బుధవారం సీబీఐకి అందింది. దీంతో ఈ కేసును సిట్ నుంచి సీబీఐ టేకోవర్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి ఫామ్ హౌస్ ఎఫ్ఐర్ ప్రకారమే సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేయనున్నట్టు సమాచారం.
స్టే
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఈడీ దర్యాప్తుపై స్టే ఇవ్వడానికి తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. ఈడీ విచారణ నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న రోహిత్ రెడ్డి అభ్యర్థనను రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈనెల 30న హాజరు కావాలని ఈడీ ఇచ్చిన నోటీసులపై జోక్యం చేసుకోవడానికి కోర్టు నిరాకరించింది. ఈడీ కేసు కొట్టివేయాలన్న ఎమ్మెల్యే రోహిత్రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు.
వందకోట్లు ఆఫర్
ఈ పిటిషన్పై జస్టిస్ కె.లక్ష్మణ విచారణ చేపట్టారు. తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి తరఫున వైకాపా ఎంపీ, సీనియర్ న్యాయవాది నిరంజన్రెడ్డి వాదనలు వినిపించారు. పార్టీ మారాలని రోహిత్రెడ్డికి వందకోట్లు ఆఫర్ ఇచ్చారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఆఫర్ మాత్రమే చేశారు కాని డబ్బు ఇవ్వలేదన్న వాదనలు వినిపించారు. ఆర్థిక లావాదేవీలు జరగలేదు కనుక ఈడీకి విచారణ పరిధి లేదన్నారు. ఈడీ ఈసీఐఆర్ మనీలాండరింగ్ చట్టానికి విరుద్ధమని వాదించారు. వ్యక్తిగత వివరాల కోసం ఈడీ తనను వేధిస్తోందన్న రోహిత్రెడ్డి అన్నారు. వాదనలు విన్న రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాలని ఈడీని ఆదేశించింది. తదుపరి విచారణను జనవరి 5కు వాయిదా వేసింది.