'ఉద్యోగాల'పై అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన... రాబోయే నాలుగేళ్లలో 3లక్షల ఉద్యోగాలు...
తెలంగాణ రాష్ట్రంలో గత కొన్నాళ్లుగా 'నియామకాల' అంశంపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల వేళ ఈ చర్చ ఈ తారాస్థాయికి చేరింది. 2014 నుంచి 2020 వరకూ లక్షా 32 వేల 899 ఉద్యోగాలు భర్తీ చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని సర్కార్ చెబుతోంది. అయితే అవన్నీ తప్పుడు లెక్కలనీ.. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణను కూడా ఉద్యోగాలు ఇచ్చిన జాబితాలో చూపిస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ప్రైవేట్ రంగంలో వచ్చిన కొలువులను కూడా తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడుతున్నాయి. అయితే గత ఆరేళ్లుగా తమ ప్రభుత్వం అనుసరిస్తున్న టీఎస్ ఐపాస్ విధానం ద్వారానే ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు పెరిగాయని ప్రభుత్వం చెబుతోంది. ఉద్యోగాల విషయమై తాజాగా అసెంబ్లీ వేదికగా మంత్రి కేటీఆర్ మరో కీలక ప్రకటన చేశారు.

రూ.70వేల కోట్ల పెట్టుబడులు... 3లక్షల జాబ్స్...
రాబోయే నాలుగేళ్లలో ఎలక్ట్రానిక్స్,విద్యుత్ వాహన రంగాల్లో రాష్ట్రానికి రూ.70వేల కోట్ల పెట్టుబడులు ఆకర్షించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. తద్వారా 3లక్షల ఉద్యోగాల కల్పన ప్రభుత్వ లక్ష్యం అని చెప్పారు.స్థానికులకు ఉద్యోగాల కల్పనలో భాగంగా ఎలక్ట్రానిక్ సిస్టమ్ డిజైన్ అండ్ మ్యానుఫాక్చరింగ్లో నిరుద్యోగ యువతకు శిక్షణ ఇస్తున్నామన్నారు. ఇప్పటికే 60వేల మందికి శిక్షణ ఇచ్చామని... ఇందులో 30వేల మందికి ఉపాధి లభించిందని చెప్పారు. ఎలక్ట్రానిక్స్ రంగానికి ప్రభుత్వ ప్రోత్సాహంపై సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి కేటీఆర్ ఇలా బదులిచ్చారు.

కొత్తగా 40 పరిశ్రమలు...
రాష్ట్రానికి కొత్తగా మరో 40 పరిశ్రమలు వచ్చాయని కేటీఆర్ అన్నారు. వాటికి రూ.2 కోట్ల నుంచి రూ.30కోట్లు వరకు పెట్టుబడి రాయితీ ఇస్తున్నామన్నారు. దివిటిపల్లి,చందన్పల్లిలో విద్యుత్ వాహనం,ఇంధన నిల్వ వ్యవస్థల అభివృద్దికి రెండు కొత్త పారిశ్రామిక క్లస్టర్లను గుర్తించినట్లు తెలిపారు. ఎలక్ట్రానిక్స్,విద్యుత్ వాహన రంగంపై అధ్యయనం కోసం ప్రత్యేక నిపుణుల బృందాన్ని,స్టీరింగ్ కమిటీని నియమించినట్లు తెలిపారు.

టీఎస్ బీపాస్పై...
టీఎస్ బీపాస్ ప్రారంభించిన 100 రోజుల్లోనే 12,943 భవన నిర్మాణాలకు అనుమతినిచ్చామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. 600 గజాల వరకు ఆన్లైన్ ద్వారానే అనుమతులు మంజూరు చేస్తున్నామని చెప్పారు. ఆన్లైన్లోనే అక్యుపెన్సీ ధ్రువీకరణ పత్రం జారీ చేస్తున్నామని తెలిపారు. కేపీహెచ్బీలోని పలు ప్రాంతాల్లో ఇళ్ల పునర్నిర్మాణానికి ఉచిత అనుమతుల విషయాన్ని ఆలోచిస్తామని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు.

రేషన్పై మంత్రి గంగుల...
వరుసగా మూడు నెలలు రేషన్ తీసుకోకపోతే రేషన్ కార్డు ఆటోమేటిక్గా రద్దు అవుతుందని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. ఐదో రోజు అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సందర్భంగా బీపీఎల్ కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డుల జారీపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి గంగుల సమాధానాలిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా తెల్ల రేషన్ కార్డుల కోసం 9,41,641 దరఖాస్తులు వచ్చాయని, ఇందులో 3,59,974 మందికి ఆహార భద్రతా కార్డులు జారీ చేశామన్నారు. 92 వేల దరఖాస్తులను తిరస్కరించామని, 4,88,775 కార్డుల దరఖాస్తులు ప్రాసెస్లో ఉన్నాయని తెలిపారు. ఆహార భద్రతా కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని స్పష్టం చేశారు. కొత్త రేషన్ కార్డులు ఇచ్చే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందన్నారు. కరోనా కారణంగానే కొత్త కార్డులను జారీ చేయలేకపోయామని.. పెండింగ్ దరఖాస్తులను త్వరలోనే వెరిఫై అర్హులకు తెల్ల రేషన్ కార్డులను జారీ చేస్తామన్నారు.












Click it and Unblock the Notifications