సంచలన తీర్పు.. ఆ బాలికకు అబార్షన్.. ఇదీ కారణం..
కోర్టులు విచక్షణతో తీర్పులు ఇస్తుంటాయి. ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని జడ్జీమెంట్ ఉంటుంది. లైంగికదాడికి గురయిన బాలిక దాల్చిన గర్భం తొలగింపు కేసులో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. బాలిక గర్భాన్ని తొలగించేందుకు అనుమతిచ్చింది. బాలిక 26 వారాల పిండాన్ని తొలగించాలని కోఠి ప్రసూతి ఆసుపత్రి సూపరింటెండెంట్ను హైకోర్టు ఆదేశించింది. పిండం హక్కుల కంటే అత్యాచార బాధితురాలి హక్కులే ముఖ్యమని స్పష్టం చేసింది.
చట్ట పరిధిలో అవాంఛనీయ గర్భం వద్దనుకునే హక్కు మహిళలకు ఉంటుందని తెలిపింది. గర్భం దాల్చిన అత్యాచార బాధితురాలి అబార్షన్కు ఆసుపత్రి నిరాకరించడంతో బాలిక తల్లి హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.విజయసేన్రెడ్డి తీర్పు వెలువరించారు. 16 ఏళ్ల బాలికపై సమీప బంధువు ఆంజనేయులు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికకు ఆసుపత్రిలో పరీక్షలు చేయించగా.. గర్భవతిగా డాక్టర్లు నిర్ధారించారు. అవాంఛిత గర్భాన్ని తొలగించాలని బాలిక, ఆమె తల్లి కోరగా... కోఠి ప్రసూతి ఆసుపత్రి డాక్టర్లు నిరాకరించారు. దీంతో తన తల్లి ద్వారా బాలిక హైకోర్టును ఆశ్రయించింది.
బాలిక ఆరోగ్యపరిస్థితిపై డాక్టర్ల కమిటీని ఏర్పాటు చేసిన హైకోర్టు .. నివేదిక సమర్పించాలని ఆదేశించింది. పరీక్షలు జరిపిన డాక్టర్ల కమిటీ.. పిండం వయసు 25 వారాలుగా తేల్చి.. కొన్ని జాగ్రత్తలతో నిపుణులు అబార్షన్ చేయవచ్చని సూచించింది. వివిధ అంశాలను పరిశీలించిన హైకోర్టు బాలికకు అబార్షన్ చేయాలని ఆదేశించింది. చట్ట ప్రకారం 24 వారాలకు మించి వయసు ఉన్న పిండం తొలగింపునకు ఆదేశాలు ఇచ్చే అధికారం రాజ్యాంగ కోర్టులకు ఉందని తెలిపింది.
గర్భం కోరుకునే హక్కుతోపాటు.. చట్ట పరిమితులకు లోబడి వద్దనుకునే హక్కు కూడా ఉంటుందని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. వచ్చిన అవాంఛనీయ గర్భాన్ని తొలగించకపోతే.. తీవ్ర మానసిక, శారీరక ఒత్తిడి ఆరోగ్యంపై ప్రభావం చూపే ప్రమాదముందని ఉన్నత న్యాయస్థానం అంది. తీవ్రమైన మానసిక ఒత్తిడి వల్ల పుట్టబోయే శిశువు ఆరోగ్యంపై ప్రభావం ఉండొచ్చంది. పిండం హక్కుల కంటే అత్యాచార బాధితురాలికి రాజ్యాంగం కల్పించిన హక్కులే ప్రాధాన్యమని స్పష్టం చేసింది.