రోడ్లు మరమ్మతులు చేసేందుకు దశాబ్ధాలు కావాలా?: జీహెచ్ఎంసీపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ)పై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం. జీహెచ్ఎంసీ పరిధిలో రోడ్ల గుంతలపై మంగళవారం హైకోర్టు విచారణ జరిగింది. ఈ సందర్భంగా అధికార యంత్రాంగం పనితీరుపై హైకోర్టు సీరియస్ అయ్యింది.
పింఛను డబ్బుతో గుంతలు పూడుస్తున్న వృద్ధ దంపతులు: జీహెచ్ఎంసీ తీరుపై హైకోర్టు ఆగ్రహం
రోడ్ల మరమ్మతులు పూర్తి చేసేందుకు ఎన్ని దశాబ్దాలు కావాలని జీహెచ్ఎంసీని హైకోర్టు ప్రశ్నించింది. ప్రజల ప్రాణాలు పోతుంటే మరమ్మతులకు దశాబ్దాలు తీసుకుంటారా? అని తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. విశ్రాంత ఉద్యోగి గంగాధర్ తిక్ దంపతులు పింఛను డబ్బుతో గుంతలు పూడ్చటంపై జరిగిన విచారణలో జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు హైకోర్టు ఎదుట హాజరయ్యారు. రోడ్ల పరిస్థితిపై హైకోర్టుకు నివేదిక సమర్పించారు.
9013 కిలోమీటర్ల రోడ్లలో 6 వేల కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేశామని కోర్టుకు తెలిపారు. వర్షాకాలంలో గుంతల పూడ్చివేత పనులు రోజూ జరుగుతున్నాయని పేర్కొన్నారు. రోడ్ల మరమ్మతుల కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కాగా, ప్రతీ వర్షాకాలంలో నీళ్లు నిలిచే ప్రాంతాలను గుర్తించి సరిచేయాలని హైకోర్టు ఈ సందర్భంగా అధికారులున ఆదేశించింది.
వరద నీటి కాలువలు, రోడ్ల మరమ్మతులు పెంచాలని, రాష్ట్రమంతటికీ ఆదర్శంగా నిలిచేలా హైదరాబాద్ ఉండాలన్నారు హైకోర్టు న్యాయమూర్తి. అంతర్జాతీయంగా పేరున్న హైదరాబాద్ నగరంపై ప్రత్యేక దృష్టి అవసరమని హైకోర్టు పేర్కొంది. నగరంలో వసతులు బాగుంటేనే పెట్టుబడులు వస్తాయని స్పష్టం చేసింది. రోడ్ల మరమ్మతుల విషయంలో రెండు వారాల్లో నివేదిక సమర్పించాలని జీహెచ్ఎంసీని హైకోర్టు ఆదేశించింది.
హైదరాబాద్ నగరానికి చెందిన గంగాధర్ తిలక్, వెంకటేశ్వరి దంపతులు రోడ్లపై గుంతలు పూడుస్తున్న అంశంపై తెలంగాణ హైకోర్టు వారం రోజుల క్రితం విచారణ చేపట్టింది. పింఛను డబ్బుతో తిలక్ దంపతులు గుంతలు పూడుస్తున్నారంటూ ఓ పత్రికలో వచ్చిన కథనంపై హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా హైకోర్టు.. జీహెచ్ఎంసీ పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వృద్ధ దంపతులు రోడ్ల మరమ్మతులు చేస్తుంటే జీహెచ్ఎంసీ అధికారులు ఏం చేస్తున్నారని హైకోర్టు ప్రశ్నించింది. రోడ్ల దుస్థితి చూడలేక వృద్ధ దంపతులు నడుం బిగించడం జీహెచ్ఎంసీకి సిగ్గుచేటని హైకోర్టు వ్యాఖ్యానించింది.