నారాయణ, శ్రీచైతన్యలకు షాక్: రాష్ట్రంలో 68 ఇంటర్ కాలేజీల మూసివేత
హైదరాబాద్: తెలంగాణ ఇంటర్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. సరైన అనుమతులు లేకుండా నిబంధనలు ఉల్లంఘించిన కళాశాలలపై హైకోర్టు ఆదేశాల మేరకు ఇంటర్ బోర్డు చర్యలు తీసుకుంది. అనుమతులు లేని 68 కళాశాలలను మూసివేస్తూ ఇంటర్ బోర్డు కార్యదర్శి జలీల్ నోటీసులు జారీ చేశారు.
మూసివేసిన కళాశాలల్లో ప్రముఖ విద్యాసంస్థలు నారాయణకు చెందిన 26, శ్రీచైతన్యకు చెందిన 18 సహా 68 కళాశాలలు ఉన్నాయి. లాక్ డౌన్ అమల్లో ఉన్నందున ఈమెయిల్ ద్వారా కళాశాలల యాజమాన్యాలకు సమాచారం అందించామని జలీల్ తెలిపారు.
కాగా, గతంలో నారాయణ, శ్రీ చైతన్య కళాశాలల్లో అక్రమాలపై విచారణ చేపట్టి గుర్తింపులేని కాలేజీలను రద్దు చేయాలంటూ సామాజిక కార్యకర్త రాజేశ్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో గుర్తింపు లేని కళాశాలలకు సంబంధించిన వివరాలపై ఇంటర్ బోర్డు హైకోర్టుకు నివేదికను సమర్పించింది.
కరోనాపై తెలంగాణ సర్కారును నిలదీసిన హైకోర్టు
తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో కరోనావైరస్ ప్రభావంపై ఎక్కువగా ఉండటంపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. కరోనావైరస్పై దాఖలైన కొన్ని ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టింది. తెలంగాణ రాష్ట్రంలో కరోనా ప్రభావం ఎలా ఉంది? టెస్టింగ్ కిట్లు ఎన్ని ఉన్నాయో వివరాలను తెలపాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రంలో 67వేల టెస్టింగ్ కిట్లే ఉన్నాయని నివేదికలో పేర్కొన్నారని.. అయితే పెద్ద సంఖ్యలో ఉన్న హాట్ స్పాట్లలోని ప్రజలకు ఎలా పరీక్షలు చేస్తారని ప్రశ్నించింది. ఏప్రిల్ 24 లోగా దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని సర్కారును ఆదేశించింది.