ఆ దేవుడితోనైనా కొట్లాటకు సిద్దం... ఏపీతో నీళ్ల పంచాయితీపై మరోసారి కుండబద్దలు కొట్టిన కేసీఆర్...
తెలంగాణ నీటి వాటాల విషయంలో ఒక్క చుక్క నీటిని కూడా వదులుకునేది లేదని గతంలోనే కుండబద్దలు కొట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్... తాజాగా ఇదే విషయాన్ని మరోసారి స్పష్టం చేశారు. వ్యవసాయ రంగం,రైతుల రక్షణ కోసం ఆ దేవుడితోనైనా సరే కొట్లాటకు సిద్దమని తేల్చి చెప్పారు. నదీజలాల విషయంలో ఏపీ ఉద్దేశపూర్వకంగా కయ్యానికి దిగుతుంటే... కేంద్రం అలసత్వం వహిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 6న అపెక్స్ కమిటీ సమావేశం నేపథ్యంలో హైదరాబాద్లోని ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.

సమగ్ర సమాచారం సిద్దం చేయాలన్న సీఎం...
అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహాలపై అధికారులకు సీఎం కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు. మరోసారి తెలంగాణ జోలికి రాకుండా వాస్తవాలను కుండబద్దలు కొట్టేలా సమగ్ర సమాచారం సిద్దం చేయాలని ఆదేశించారు. తెలంగాణ ఉద్యమ నినాదంలో 'నీళ్లు' కీలక అంశమని... ఏపీ చేస్తున్న రాద్దాంతాన్ని గట్టిగా తిప్పికొట్టాలని సూచించారు. గోదావరి,కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కుగా వచ్చే ప్రతీ చుక్కనూ వాడుకుంటామన్నారు. పంట దిగుబడి విషయంలో ఇప్పుడు తెలంగాణ రైతు దేశానికే ఆదర్శంగా నిలిచాడని... దేశానికే తెలంగాణ ధాన్యాగారంగా మారిందని అన్నారు. సాగునీటి రంగాన్ని బలోపేతం చేసి బీళ్లను సైతం పచ్చగా మారుస్తున్నామని చెప్పారు.

ఏపీ తీరుపై భగ్గుమంటున్న కేసీఆర్...
నదీ జలాల విషయంలో ఆంధ్రప్రదేశ్ తీరును సీఎం కేసీఆర్ గత రెండు,మూడు నెలలుగా తీవ్రంగా ఎండగడుతున్న సంగతి తెలిసిందే. పిలిచి పీటేసి అన్నం పెడితే కెలికి కయ్యం పెడుతారా అంటూ గతంలోనే జగన్ సర్కార్పై ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ ప్రభుత్వం అర్థం పర్థం లేని, నిరాధారమైన, అనవసర రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు. బేసిన్లు లేవు,భేషజాలు లేవు పరపస్పర సహకారంతో ముందుకెళ్దామని చెప్తే... కెలికి కయ్యం పెట్టుకుంటున్నారని విమర్శించారు.

తెలంగాణ వాదన...
తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల మధ్య వివాదాలు ముందునుంచీ నెలకొన్న నేపథ్యంలో, పునర్విభజన చట్టం సెక్షన్ -13ను అనుసరించి వీటిని పరిష్కరించే బాధ్యతను ట్రిబ్యునల్కు అప్పగించాలని తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచీ కోరుతూ వస్తోంది. కానీ, తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తిని కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ పట్టించుకోలేదు. కొత్త రాష్ట్రాలు ఏర్పడినపుడు కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ చొరవ తీసుకుని నీటి వాటాల పంపిణీని చేపట్టే ఆనవాయితీ ఉందని...కానీ కేంద్రం పూర్తిగా దీన్ని విస్మరించిందని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. నిజానికి ఇరు రాష్ట్రాల మధ్య వివాదాలు లేని పరిస్థితుల్లో మాత్రమే కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నీటి వాటాల పంపిణీ జరగాలని... వివాదాలు నెలకొన్నప్పుడు పరిష్కార బాధ్యతను ట్రిబ్యునల్కు అప్పగించాలని అంటోంది.
Recommended Video

పోతిరెడ్డిపాడుతో వివాదం షురూ..
నిజానికి రెండు రాష్ట్రాల మధ్య నీటి వివాదాల్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకునేందుకు సీఎంలు కేసీఆర్,జగన్ మొదట్లోనే ఒక అవగాహనకు వచ్చారు. అయితే పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు విషయంలో జగన్ కేసీఆర్ను సంప్రదించకపోవడంతో విబేధాలు మొదలయ్యాయి. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపును తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. మరోవైపు, అపెక్స్ కౌన్సిల్ సమావేశం అగస్టులోనే జరగాల్సి ఉన్నా రెండుసార్లు వాయిదాపడ్డ సంగతి తెలిసిందే. ముందస్తు షెడ్యూల్ కారణంగా కౌన్సిల్ భేటీకి హాజరుకాలేమని తెలంగాణ ప్రభుత్వం చెప్పడంతో అగస్టులో సమావేశం వాయిదాపడింది. అనంతరం ఆగస్టు 25న అపెక్స్ కౌన్సిల్ భేటీ నిర్వహించాలనుకున్నప్పటికీ... కేంద్ర మంత్రికి కరోనా సోకడంతో మరోసారి వాయిదాపడింది.












Click it and Unblock the Notifications