తెలంగాణలో తగ్గిన కరోనా జోరు: ఒక్కసారిగా క్షీణించిన పాజిటివ్ కేసులు: కారణం తెలుసా?
హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. ఈ మధ్యకాలంలో ఎప్పుడూ లేనంతగా తక్కువ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అదే సమయంలో- కరోనా బారి నుంచి కోలుకున్న వారి సంఖ్యలో స్థిరత్వం కొనసాగుతోంది. యాక్టివ్ కేసుల సంఖ్యలోనూ క్షీణత కనిపించింది. మరణాల సంఖ్యలో పెద్దగా ఎలాంటి మార్పూ నమోదు కాలేదు. రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు ఉన్నట్టుండి తగ్గడానికి ప్రధాన కారణం.. టెస్టులను తగ్గించడమేనని తెలుస్తోంది. రోజువారీ కరోనా పరీక్షలు సగానికి తగ్గించిన ప్రభావం పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుదలకు కారణమైందని అంటున్నారు.
కొత్తగా 1,307 కేసులు..
తెలంగాణలో కొత్తగా 24 గంటల వ్యవధిలో 1,307 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. తొమ్మిదిమంది మరణించారు. 2,230 మంది సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకున్నారు. ఆసుప్రతులు, కోవిడ్ కేర్ సెంటర్ల నుంచి డిశ్చార్జి అయ్యారు. దీనితో ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,72,608కి చేరుకున్నాయి. ఇందులో 2,230 మంది డిశ్చార్జి కాగా.. 1,042 మంది మరణించారు. యాక్టివ్ కేసుల సంఖ్యలోనూ తగ్గుదల కనిపించింది. ప్రస్తుతం తెలంగాణలో చికిత్స పొందుతోన్న కరోనా పేషెంట్ల సంఖ్య 29,636గా నమోదైంది. గృహాలు, ఐసొలేషన్ కేంద్రాల్లో చికిత్స పొందుతోన్న వారి సంఖ్య 22,990కి చేరింది.
రోజువారీ కేసుల్లో క్షీణత..
రోజువారీ కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 1300లకు క్షీణించడం చాలాకాలం తరువాత ఇదే తొలిసారి. ఈ స్థాయిలో తగ్గుదల ఈ మధ్యకాలంలో ఎప్పుడూ నమోదు కాలేదు. దీని ప్రభావం యాక్టివ్ కేసులపైనా పడింది. 2,230 మంది డిశ్చార్జి కావడం, ఆ స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు కాకపోవడం వల్ల యాక్టివ్ కేసులు తగ్గాయి. 30 వేల దిగువకు చేరుకున్నాయి. 29,636గా నమోదు అయ్యాయి. రోజువారీ కేసులు తగ్గడానికి ఆశించిన స్థాయిలో టెస్టులు లేకపోవడమే కారణమని తెలుస్తోంది. 24 గంటల వ్యవధిలో 31,095 శాంపిళ్లను పరీక్షించారు. ఇదివరకు ఈ సంఖ్య 60 వేలు, అంతకుమించి నమోదవుతుండేది.
గ్రేటర్ హైదరాబాద్ సహా జిల్లాల్లో తగ్గిన కేసులు..
అధికారులు తాజాగా విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. గ్రేటర్ హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల తీవ్రత తగ్గినట్టే కనిపిస్తోంది. ఇదివరకు 400 వరకు నమోదయ్యు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్లో 24 గంటల్లో కొత్తగా 266 కేసులు రికార్డు అయ్యాయి. ఒక్క కరీంనగర్ను మినహాయించితే.. మరే జిల్లాలోనూ కరోనా కేసులు వంద మార్క్ను అందుకోలేదు. రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల్లోనూ కరోనా దూకుడు తగ్గిందనే విషయాన్ని ఈ బులెటిన్ స్పష్టం చేస్తోంది. రోజువారీ టెస్టులు పెంచితే..దానికి అనుగుణంగా కేసులూ పెరిగే అవకాశాలు లేకపోలేదు.
Recommended Video
జిల్లాలవారీగా..
కొత్తగా 24 గంటల వ్యవధిలో ఆదిలాబాద్-8, భద్రాద్రి కొత్తగూడెం-29, జగిత్యాల-34, జనగామ-18, జోగుళాంబ గద్వాల-18, కామారెడ్డి-14, కరీంనగర్-102, ఖమ్మం-35, కొమరంభీమ్ ఆసిఫాబాద్-8, మహబూబ్ నగర్-24, మహబూబాబాద్-45, మంచిర్యాల-20, మెదక్-16, మేడ్చల్ మల్కాజ్గిరి-24, ములుగు-15, నాగర్ కర్నూలు-37, నల్లగొండ-70, నారాయణపేట్-4, నిర్మల్-13, నిజామాబాద్-50, పెద్దపల్లి-20, రాజన్న సిరిసిల్ల-23, రంగారెడ్డి-98, సంగారెడ్డి-54, సిద్ధిపేట్-92, సూర్యాపేట్-26, వికారాబాాద్-10, వనపర్తి-25, వరంగల్ రూరల్-18, వరంగల్ అర్బన్-62, యాదాద్రి భువనగిరి-24 కేసులు నమోదు అయ్యాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఒక్క కేసూ నమోదు కాలేదు.