రేవంత్ ఆన్ ఫైర్ : నీళ్లు, నిధులు, నియామకాలు ప్రజల నినాదం కాదు... టీఆర్ఎస్ నినాదం
Recommended Video

నీళ్లు, నిధులు, నియామకాలు ప్రజల నినాదం కాదని అది టీఆర్ఎస్ నినాదమని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. హైదరాబాద్లో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో రేవంత్ పాల్గొని జర్నలిస్టులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన కేసీఆర్ పాలనపై నిప్పులు చెరిగారు. బంగారు తెలంగాణ తీసుకొస్తామన్న కేసీఆర్ ఇప్పటి వరకు ఒక్క హామీని కూడా నెరవేర్చలేదన్నారు.కేవలం ప్రజల భావోద్వేగాలతో కేసీఆర్ ఆడుకుంటున్నారని మండిపడ్డారు. ఆత్మగౌరవం, సామాజిక న్యాయం, స్వయం పాలనే లక్ష్యంగా తెలంగాణ ఉద్యమం జరిగిందని గుర్తుచేశారు. కుటుంబ పాలన తీసుకొచ్చి నక్సలైట్ అజెండాను కేసీఆర్ తుంగలో తొక్కారని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు.

కేటీఆర్ తనయుడు ఏమైనా రోల్ మోడలా..?
కేసీఆర్ మనవడు ఏ సన్న బియ్యంతో అయితే అన్నం తింటాడో.. అదే సన్న బియ్యంతో పిల్లలు అన్నం తినేలా చేస్తామని కేటీఆర్ చెబుతున్నాడని గుర్తు చేసిన రేవంత్ రెడ్డి.... కేసీఆర్ మనవడు దీనికేమైనా కొలబద్దనా అని ప్రశ్నించారు. కొన్ని ప్రభుత్వ కార్యక్రమాలకు మనవడిని తీసుకెళ్లడంపై అభ్యంతరం తెలిపారు రేవంత్ రెడ్డి. కేటీఆర్ తనయుడిని రోల్ మోడల్గా చేసి చూపించే ప్రయత్నం చేస్తోందని రేవంత్ విమర్శించారు. తనకున్న ఒక్క కూతురి నిశ్చితార్థానికి తాను హాజరుకాకుండా కేసీఆర్ పెద్ద ప్రయత్నమే చేశారన్నారు. ఢిల్లీ నుంచి లాయర్లు పిలిపించుకుని బెయిల్ దక్కకుండా చూడాలనే ప్రయత్నం చేశారని రేవంత్ మండిపడ్డారు. అదేమి రాక్షసానందమో తనకు అర్థం కావడం లేదని అన్నారు.

పరిపాలన అనుభవం లేదనేది తప్పుడు ప్రచారం
రేవంత్ రెడ్డి అనే వ్యక్తి కేవలం రాజకీయ విమర్శలు, రాజకీయ ప్రసంగాలకు మాత్రమే పనికొస్తారని పాలనాపరంగా పనికిరారని కొందరు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. తనకు అవకాశమిస్తే ఏంచేయగలరో రేవంత్ రెడ్డి చెప్పారు. పరిపాలన విభాగంలో ప్రజలను భాగస్వాములను చేయాలనే ఆలోచనతో తాను ఉన్నట్లు చెప్పిన రేవంత్ రెడ్డి... ఎన్టీఆర్ టీడీపీ పార్టీని పెట్టి 9నెలల్లోనే ముఖ్యమంత్రి అయి ప్రజారంజక పాలన అందించారని గుర్తుచేశారు. మరి ఆయనకు అప్పటివరకు పరిపాలనలో అనుభవం లేదన్నారు. ఇందిరాగాంధీ హఠాన్మరణంతో ప్రధాని బాధ్యతలు స్వీకరించిన రాజీవ్ గాంధీ... దేశ సాంకేతికరంగంలో సంస్కరణలు తీసుకొచ్చారని రేవంత్ గుర్తుచేశారు.

జర్నలిస్టులు, పోలీసులు, ఆర్టీసీ కార్మికుల పిల్లలకు ఉచిత విద్య
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సమాజంలో ఫలానా సమయం అంటూ లేకుండా నిత్యం శ్రమించే జర్నలిస్టులు, పోలీసులు, ఆర్టీసీ కార్మికుల పిల్లలకు ఉచిత విద్యను అందిస్తామన్నారు. వారి పిల్లల కోసం వంద ఎకరాల్లో అటానమస్ యూనివర్శిటీని నిర్మించి అందులోనే మెడికల్ ఇంజనీరింగ్ విద్యను అందించాలన్న ఆలోచన తనకుందన్నారు. మరోవైపు చదువుకున్న యువతకు ఉద్యోగాలిస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి.... ప్రతి సంవత్సరం ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పారు. అధికారంలోకి వస్తే జనవరి నెల నుంచే పలు శాఖల్లో ఉద్యోగాల భర్తీ చేపడతామన్నారు.

లాభసాటిగా వ్యవసాయం... మహిళల ఆస్తుల రిజిస్ట్రేషన్పై 2శాతమే స్టాంప్ డ్యూటీ
రైతన్న దేశానికి వెన్నెముకన్న రేవంత్ రెడ్డి రైతులకు రుణమాఫీ తాత్కాలిక ఉపశమనమే అన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు కృషి చేస్తామన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం ద్వారా శాశ్వత పరిష్కారం ఉంటుందన్నారు. రైతుల నుంచి ప్రభుత్వమే పంటను నేరుగా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు రేవంత్ రెడ్డి. ఇక మహిళలకు పూర్తి భద్రత కల్పిస్తామన్న రేవంత్ రెడ్డి.... ఆస్తిలో మహిళలకు కూడా సమాన హక్కును కల్పించారని గుర్తు చేశారు. అయితే తాము అధికారంలోకి వస్తే మహిళలపై ఆస్తులు రిజిస్టర్ చేయిస్తే ప్రస్తుతం ఉన్న స్టాంప్ డ్యూటీ ఆరుశాతంను రెండు శాతానికి తగ్గిస్తామని చెబుతూ మహిళలకు భరోసా ఇచ్చారు.












Click it and Unblock the Notifications