తొలుత 80 లక్షల మందికి వ్యాక్సిన్.. రెండు డోసుల కోసం లక్ష 60 వేల డోసులు..
కరోనా వైరస్ వ్యాక్సిన్పై కేంద్రం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే డేటా రూపొందించిన సంగతి తెలిసిందే. రాష్ట్రాలకు కూడా మార్గనిర్దేశనం చేసింది. తెలంగాణలో న్యూ ఇయర్లో వ్యాక్సిన్ ఇచ్చే ప్రక్రియ ప్రారంభం కానుంది. జనవరి 15వ తేదీ నుంచి టీకాలు ఇస్తామని.. 80 లక్షల మందికి అందజేస్తామని ప్రజారోగ్య డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. వారం పది రోజుల్లో తొలి డోసు ఇస్తామని ఆయన చెప్పారు.
భారత వాతావరణం, పరిస్థితులకు అనుకూలంగా భారత్ బయోటెక్ కోవాక్సిన్, సీరం ఇనిస్టిట్యూట్ వ్యాక్సిన్లు సరిపోతాయని తెలిపారు. అవసరాన్ని బట్టి ఫైజర్ వ్యాక్సిన్ ఉపయోగిస్తామని సంకేతాలు ఇచ్చారు. అయితే ఆ వ్యాక్సిన్ శీతల ప్రదేశంలో నిల్వ చేయడమే కష్టంగా మారుతోందని చెప్పారు. మైనస్ 70 డిగ్రీ ఉష్ణోగ్రతలో ఎన్ని వ్యాక్సిన్లు స్టోర్ చేయగలమనేదీ ప్రశ్న అని చెప్పారు. ఒకవేళ చేసినా.. అదీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అని చెప్పారు.
వ్యాక్సిన్ కోసం ఇప్పటికే కసరత్తు చేశామని.. ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ కూడా ఇచ్చామని తెలిపారు. రాష్ట్రంలో 80 లక్షల మందికి రెండు డోసుల కోసం లక్ష 60 వేల డోసులు అవసరం అవుతాయని చెప్పారు. మూడు లక్షల మంది వైద్యులు, నర్సు, వార్డు బాయ్స్, టెక్నికల్ సిబ్బందికి వ్యాక్సిన్ అందజేస్తామని తెలిపారు. పారిశుద్ద్య కార్మికులు, రక్షణరంగానికి చెందిన వారికి రెండో విడతలో ఇస్తామని చెప్పారు. మూడు, నాలుగో విడతల్లో వయస్సువారీగా ఇస్తామని వివరించారు. రాష్ట్రంలో అందరికీ తొలి డోసు పూర్తయిన.. 4 వారాలకు రెండో డోసు ఇస్తామని తెలిపారు.