పదో తరగతి ఫలితాలు విడుదల.. బాలికలదే పైచేయి.. జగిత్యాల టాప్, హైదరాబాద్ లాస్ట్
హైదరాబాద్ : తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ కమిషనర్ జనార్ధన్ రెడ్డి ఫలితాలు వెల్లడించారు. జగిత్యాల జిల్లా మొదటిస్థానంలో నిలవగా.. హైదరాబాద్ జిల్లా ఆఖరి స్థానానికి పరిమితమైంది. ఈసారి కూడా బాలికలే పైచేయి సాధించారు. మొత్తం విద్యార్థుల ఉత్తీర్ణత చూసినట్లయితే 92.43 శాతంగా నమోదైంది.
99.73 శాతం ఉత్తీర్ణతతో జగిత్యాల జిల్లా విద్యార్థులు మొదటిస్థానం సాధించారు. 83.09 శాతంతో హైదరాబాద్ జిల్లా విద్యార్థులు చివరిస్థానంలో నిలిచారు. మొత్తంగా చూసినట్లయితే బాలురు 91.18 శాతం.. బాలికలు 93.68 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఫలితాలు ఈ వెబ్ సైట్ల ద్వారా చూసుకోవచ్చు.
www.bse.telangana.gov.in, http://results.cgg.gov.in

మార్చి 16వ తేదీ నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు నిర్వహించిన పదో తరగతి పరీక్షలు రాయడానికి 5 లక్షల 52 వేల 280 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు. అందులో 5 లక్షల 46 వేల 728 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. 5 లక్షల 6 వేల 202 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. దాదాపు 40 వేల మందికి పైగా ఫెయిలయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది స్కూళ్లల్లో సున్నా ఉత్తీర్ణత శాతం నమోదైంది. వచ్చే నెల 10వ తేదీ నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు.
పదో తరగతి ఫలితాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఒకటికి రెండుసార్లు అధికారులు పరిశీలించినట్లు తెలుస్తోంది. ఒక సబ్జెక్టులో తక్కువ మార్కులు వచ్చి, మిగతా సబ్జెక్టుల్లో ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థుల విషయంలో వారి ఆన్సర్ షీట్లను తిరిగి పరిశీలించినట్లు సమాచారం. మొత్తానికి అన్నివిధాలుగా ఒకే అనుకున్న తర్వాత సోమవారం నాడు ఫలితాలు విడుదల చేశారు. విద్యార్థుల నుంచి ఫిర్యాదులు, అభ్యంతరాలను స్వీకరించడానికి మొబైల్ యాప్ ను కూడా సిద్ధం చేశారు. ఆయా స్కూళ్లకు సంబంధించిన విద్యార్థుల ఫలితాలు ఒకే చోట కన్పించేలా ఏర్పాట్లు చేశారు.












Click it and Unblock the Notifications