శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తిని ఆపండి: తెలంగాణ, కేఆర్ఎంబీ కీలక భేటీ
శ్రీశైలం ప్రాజెక్టులో జల విద్యుత్ ఉత్పత్తి ఆపాలంటూ తెలంగాణ ప్రభుత్వం.. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్(కేఆర్ఎంబీw)కు లేఖ రాసింది.
హైదరాబాద్: శ్రీశైలం ప్రాజెక్టులో జల విద్యుత్ ఉత్పత్తి ఆపాలంటూ తెలంగాణ ప్రభుత్వం.. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్(కేఆర్ఎంబీw)కు లేఖ రాసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా కృష్ణా నీటిని పంపిణీ చేసేందుకు కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ శుక్రవారం సమావేశం కానున్న క్రమంలో ఈ లేఖ రాయడం గమనార్హం.
కాగా, కృష్ణా బోర్డ్ త్రిసభ్య కమిటీ శుక్రవారం నిర్వహించే సమావేశంలో బోర్డ్ సభ్య కార్యదర్శి డీఎం రాయ్పురే, తెలంగాణ నీటి పారుదల శాఖ ఇంజినీర్-ఇన్-చీఫ్ మురళీధర్, ఏపీ జలవనరుల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ నారాయణ రెడ్డి కమిటీలో సభ్యులుగా పాల్గొననున్నారు. ఈ సమావేశం హైదరాబాద్ జలసౌధలోని బోర్డు కార్యాలయంలో జరగనుంది.

గత డిసెంబర్ నెలలోనే జరగాల్సిన బోర్డు సమావేశం అనేక కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాలకు కృష్ణా ప్రాజెక్టుల్లో నుంచి ఎంత మేరకు నీరు అవసరమనే అంశంపై చర్చించి.. నీటి పంపిణీని ఖరారు చేయనున్నారు. శ్రీశైలంలో ఇప్పటి వరకు 34 టీఎంసీలు నీరు అందుబాటులో ఉండగా, నీటిని తోడుకునే కనీస మట్టం స్థాయి 18 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
మరోవైపు, నాగార్జున సాగర్లో 90 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు నీటి పారుదల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నీటిని మే 31 ముగిసే నాటికి తెలుగు రాష్ట్రాల అవసరాలను పరిగణలోకి తీసుకోవాలంటున్నారు. ఇప్పటికే వినియోగించిన వాటా పోనూ.. అందులో మిగిలిన నీటిని ఈ తెలుగు రాష్ట్రాలకు పంపిణీ చేయనున్నారు. ఇది ఇలావుంటే, శ్రీశైలం ప్రాజెక్టులో నీరు అడుగంటుకుందని, ఇక జల విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయాలని కోరుతూ కేఆర్బీఎంకు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది.












Click it and Unblock the Notifications